PM Modi: గోవాకు ప్రధాని మోదీ
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఈ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ.
PM Modi: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఈ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని.. ఇవాళ గోవాకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్రంలో జరుగనున్న గోవా లిబరేషన్ డే ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు.
గోవాలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జి స్టేడియంలో గోవా లిబరేషన్ డే సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భారత భూభాగాలైన గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆపరేషన్ విజయ్లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించి, ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.
భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండేవి. వాళ్ల నుంచి ఆయా ప్రాంతాలను విముక్తం చేయడం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. చివరికి 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ నుంచి గోవాను విముక్తి పొందింది.