Rajnath Singh : దేశానికి ఏదైనా హాని తలపెడితే.. భారత్ విడిచిపెట్టదు : చైనాకు రాజ్నాథ్ వార్నింగ్..!
Rajnath Singh : భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశం పట్ల ఏదైనా హాని తలపెడితే ఎవరిని భారత్ వదిలిపెట్టదని హెచ్చరించారు.
Rajnath Singh : భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) డ్రాగన్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం పట్ల ఏదైనా హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తే ఎవరిని భారత్ వదిలిపెట్టదని రాజ్ నాథ్ సింగ్ చైనాను పరోక్షంగా హెచ్చరించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్లో గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఆయన అన్నారు. భారత్ ప్రపంచంలో టాప్ 3లో కొనసాగుతోందని రాజ్ నాథ్ చెప్పారు. చైనా సరిహద్దులో భారత సైనికులు చూపుతున్న ధైర్యసాహసాలను ఆయన ప్రస్తావించారు. భారత సైనికులు ఏమి చేశారో మా దేశ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తాను బహిరంగంగా ప్రస్తావించలేనన్నారు. అయితే భారత్కు హాని కలిగించే చర్యలు చేపడితే మాత్రం.. భారత్ ఎవరినీ విడిచిపెట్టదని (చైనాకు) పరోక్షంగా ఖచ్చితంగా చెప్పగలను (భారత్ కో అగర్ కోయి ఛెరేగా టు భారత్ చోరేగా నహీ) అని ఆయన హిందీలో గట్టిగా హెచ్చరించారు.
మే 2020లో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్, చైనా సైన్యాల మధ్య లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన మొదలైంది. జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో ఇరు సేనలు ఘర్షణకు దిగడంతో ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు, అనేక మంది చైనా సైనికులు మరణించారు. తూర్పు లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనా ఇప్పటివరకు 15 రౌండ్ల సైనిక చర్చలు నిర్వహించాయి. దీని కారణంగా గత ఏడాదిలో పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున గోగ్రా ప్రాంతంలో ఇరుపక్షాలు విచ్ఛేద ప్రక్రియను పూర్తి చేశాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఉద్భవించిందని కొనియాడారు. ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతుందని ఆయన నొక్కి చెప్పారు.
భారత్ ముఖచిత్రమే మారిపోయిందని, దేశ ప్రతిష్ట మెరుగుపడిందన్నారు. రాబోయే కొద్ది ఏళ్లల్లో ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ను ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలుగా ఎదగకుండా ఆపలేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్కు ఒక దేశంతో మంచి సంబంధాలు ఉన్నాంత మాత్రనా.. మరే ఇతర దేశంతోనూ సత్సాబంధాలు ఉండవని అర్థం కాదన్నారు. భారత్ ఎప్పుడూ ఇలాంటి దౌత్యాన్ని అవలంబించలేదని రాజ్ నాథ్ గుర్తు చేశారు. భారత్ ఎన్నటికీ దీనిని దౌత్యంగా ఎంచుకోదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంబంధాలలో జీరో-సమ్ గేమ్ను భారత్ విశ్వసించదని రాజ్ నాథ్ క్లారిటీ ఇచ్చారు.
భారత్, రెండు దేశాలకు “విజయం-విజయం” ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉండాలని విశ్వసిస్తుందని ఆయన అన్నారు. యుక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరితో పాటు రష్యా చమురును రాయితీపై కొనుగోలు చేయాలనే నిర్ణయంపై వాషింగ్టన్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. రక్షణ మంత్రి వాషింగ్టన్ DCలో భారత్ అమెరికా 2+2 మంత్రివర్గానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఆ తర్వాత అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ (IndoPACOM) ప్రధాన కార్యాలయంలో సమావేశాలకు వెళ్లారు.
Read Also : Rajnath Singh: సాయుధ బలగాల్లో మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పిస్తాం: రాజ్ నాథ్ సింగ్