ఐపీఎల్-2020 : మార్చి 29వ తేదీ నుంచి మ్యాచ్లు
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఉండే ప్రత్యేకమైన అభిమానం చెప్పక్కర్లేదు. భారత్లో జరిగే అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్. ప్రతీ ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. 2020 సీజన్ వచ్చే ఏడాది మార్చి 29న ప్రారంభం కానున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన ఓ అధికారి సోమవారం వెల్లడించాడు. లీగ్ తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుందని అధికారి చెబుతున్నాడు. వాంఖడేలో మ్యాచ్ కాబట్టి డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. మరో జట్టు ఏదనేది మాత్రం వెల్లడించలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం సమయానికి (మార్చి 29వ తేదీ) అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టీ20 సిరీస్ మార్చి 29న, ఇంగ్లాండ్-శ్రీలంక టెస్ట్ సిరీస్ మార్చి 31తో ముగుస్తుంది. దీంతో తొలి రెండు ఐపీఎల్ మ్యాచ్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకకు చెందిన కొందరు ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్చి 31తో దాదాపుగా అంతర్జాతీయ సిరీస్లు ముగుస్తుండగా తర్వాత ప్లేయర్లు ఐపీఎల్ జట్లతో కలుస్తారు.
మార్చి 29వ తేదీన మ్యాచ్లు ప్రారంభించాలని ఆల్మోస్ట్ బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. కొన్ని ఫ్రాంచైజీలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మ్యాచ్లు ప్రారంభించాలని కోరుతున్నాయి. ఐపీఎల్ కౌన్సిల్ మాత్రం మార్చి 29నే లీగ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐపీఎల్ 13 సీజన్కు సంబంధించిన వేలం 2019 డిసెంబరు 19వ తేదీన ముగిసింది. కోల్కతా వేదికగా జరిగిన వేలంలో పలువురు క్రికెటర్లకు ఊహించని ధరలు దక్కాయి.