APSRTC : పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలతో తిరుమల భక్తులపై పెనుభారం
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీజిల్ సెస్ను దూరాన్ని బట్టి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పెంపుతో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. పెంచిన డీజిల్ సెస్ శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తాజా పెంపుతో డీజిల్ సెస్.. బస్సు టైప్, దూరాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది.
కాగా ఈ చార్జీల పెంపు శ్రీవారి భక్తులపై పెను భారాన్ని మోపింది. ప్రస్తుతం తిరుపతి నుంచి తిరుమలకు బస్సు ఛార్జి 75 రూపాయలుగా ఉంది. ఇది పెరిగిన ధరతో 90 రూపాయలు అయ్యింది. 18 కిలోమీటర్ల దూరానికి ఆర్టీసీ 15 రూపాయలు ఒక్కసారిగా పెంచింది. పిల్లల టికెట్ ధర ప్రస్తుతం రూ.45 ఉండగా అది..రూ.50కి పెరిగింది. రాను పొను టికెట్ ధర ప్రస్తుతం రూ.135 ఉండగా దానిని రూ.160 చేశారు. గడిచిన నాలుగేళ్లలో తిరుపతి తిరుమల టికెట్ ధర 40 రూపాయలు పెరిగింది. 2018లో టికెట్ ధర రూ.50 ఉండగా నేడు అది రూ.90కి చేరింది.
పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీ ప్రస్తుతం రూ.10గా ఉంది. అదే 30 కిలో మీటర్ల వరకు అయితే పల్లె వెలుగులో డీజిల్ సెస్ పెంపు ఉండదు. 30కిలోమీటర్ల నుంచి 60 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం వసూలు చేస్తున్న డీజిల్ సెస్కు అదనంగా మరో రూ.5 చెల్లించాల్సిందే. ఈ బస్సుల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట ఆర్టీసీ బస్సుల్లో రూ.5 వసూలు చేస్తున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ను పెంచడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 కిలో మీటర్ల దాకా డీజిల్ సెస్ పెంచేది లేదు. 31 నుంచి 65 కిలో మీటర్ల వరకు అదనంగా రూ. 5 వసూలు చేయనుంది.ఈ బస్సుల్లో 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట రూ.10 మాత్రమే వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ను పెంచలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇకపై డీజిల్ సెస్ కింద రూ.70 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : Senior Resident Doctors : కొనసాగుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన