Coimbatore Blast In Car Case : కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుళ్ల కేసు .. తమిళనాడులోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. కోయంబత్తూరులో 40 ప్రాంతాల్లోను..చెన్నైలో 5 ప్రాంతాల్లోను NIA తనిఖీలు నిర్వహిస్తోంది.
Coimbatore Blast In Car Case : కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా బుధవారం (నవంబర్ 9,2022)అర్ధరాత్రి నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. కోయంబత్తూరులో 40 ప్రాంతాల్లోను..చెన్నైలో 5 ప్రాంతాల్లోను NIA తనిఖీలు నిర్వహిస్తోంది. అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
అక్టోబర్ (2022) 23న ఉదయం 4.30 గంటల సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్ బాల్స్, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పేలుడు వెనుక ఎవరో ప్లాన్ ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ పేలుడులో చనిపోయిన ముబిన్కు టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ముబిన్ను గతంలో ఎన్ఐఏ కూడా విచారించింది. ముబిన్ కారులో పేలుడు పదార్ధాలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముబిన్ తన ఇంటి నుంచి సిలిండర్ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ముబిన్తో పాటు ఐదుగురు వ్యక్తులు ఆ సమయంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో తమిళనాడులోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు.