Ashes 2023 : గెలిచినా, ఓడినా ఐసీసీ షాక్లు తప్పడం లేదుగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు భారీ జరిమానా
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్లో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది
Ashes ENG vs AUS : యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా(Australia) శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్(England)తో ఎడ్జ్బాస్టన్లో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్(Pat Cummins) అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రస్తుతం పుల్ జోష్లో ఉండగా ఇంగ్లాండ్ ఓటమి బాధలో కూరుకుపోయింది. అయితే.. రెండు జట్లకు ఐసీసీ షాకిచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించింది. అంతేనా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చెరో రెండు పాయింట్లను కోత విధించింది.
ఈ మ్యాచ్లో ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు స్లో ఓవర్ రేటును నమోదు చేశాయి. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లను తక్కువగా వేశాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతీ ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తారు. ఈ లెక్కన రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో 40 శాతాన్ని ఫైన్గా వేశారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ జరిమానా విధించారు.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆడే జట్లు స్లో ఓవర్ రేటుకు పాల్పడితే.. ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక్కొ ఓవర్కు పాయింట్ల పట్టికలో ఒక పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన రెండు జట్లకు రెండు పాయింట్లు కోత్ విధించారు. ఆస్ట్రేలియా రెండు పాయింట్లు కోల్పోయిన 2023-2025 డబ్ల్యూటీసీ పట్టికలో 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, -2 పాయింట్లతో ఇంగ్లాండ్ ఆఖరి స్థానంలో ఉంది. యాషెస్ సిరీస్తోనే డబ్ల్యూటీసీ(2023-2025) మూడో సీజన్ ఆరంభమైంది.