Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు
మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గత ఏడాది ఈ పురుగు దాడివల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు బయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు.
![Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు](https://10tv.in/wp-content/uploads/2023/10/Maize-Cultivation.jpg)
Maize Cultivation
Maize Cultivation : మొక్కజొన్న.. రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహారధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రబీ మొక్కజొన్నవిత్తే సమయం కావడంతో ఈ పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. విజయ్ .
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు . మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దాణాలో ప్రధాన ముడి సరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగుచేస్తారు. పేలాలు, స్వీట్ కార్నగా, బేబీకార్న్ గా ఇలా వివిధ రకాలుగా మొక్కజొన్నను సాగుచేసేందుకు పలురకాల హైబ్రిడ్ లు అందుబాటులో వున్నాయి.
రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబరు మొదటివారం నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే నేల యాజమాన్యం, విత్తన మోతాదు , విత్తే సమయం, ఎరువులు, కలుపు యాజమాన్యం ముఖ్యమంటూ రైతులకు సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. విజయ్ .
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
మంచి హైబ్రీడ్ రకాలు ఉన్నా, రైతులు అంతగా దిగుబడి తీసుకోలేక పోతున్నారు. సారవంతమైన నేలల్లో సాగుచేయకపోవడమే కాకుండా, కలుపు నివారణ సరిగా చేయకపోవడంతో పెద్దగా దిగుబడులను ఆశించ లేకపోతున్నారు . శాస్త్రవేత్త సూచనల మేరకు ఎరువులు, నీటి యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు.
ఈ మధ్య కాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గత ఏడాది ఈ పురుగు దాడివల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు బయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. కత్తెర పురుగు నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.