ODI World Cup 2023 : అసలే ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..! సెమీస్కు ముందే ఇలా జరగాలా..!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే.. సెమీ ఫైనల్ కు ముందు ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
![ODI World Cup 2023 : అసలే ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..! సెమీస్కు ముందే ఇలా జరగాలా..! ODI World Cup 2023 : అసలే ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..! సెమీస్కు ముందే ఇలా జరగాలా..!](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-21.jpg)
South Africa (IMG @ ANI)
ODI World Cup : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే.. సెమీ ఫైనల్ కు ముందు ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. సఫారీ స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా ఈ మెగాటోర్నీలోని మిగిలిన మ్యాచులకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోల్కతా వేదికగా ఆదివారం టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఎంగిడి గాయపడ్డాడు.
భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రవీంద్ర జడేజా కొట్టిన బంతిని ఆపే క్రమంలో ఎంగిడి కాలికి గాయమైంది. దీంతో నొప్పితో అతడు విలవిలలాడాడు. నొప్పి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ ఓవర్ను పూర్తి చేయకుండానే అతడు డగౌట్కు వెళ్లిపోయాడు. మిగిలిన బంతులను మార్కో జాన్సెన్ వేశాడు. అనంతరం ఎంగిడి బ్యాటింగ్కు వచ్చాడు. మూడు బంతులు మాత్రమే ఆడి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Gavaskar: కోహ్లి బర్త్ డే సెంచరీ.. గావస్కర్ జోస్యం ఫలించింది!
మ్యాచ్ అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరం అని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఈ మెగాటోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాడు. అతడి బ్యాకప్గా రిలీ రూసోను భారత్కు పంపింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. పేసర్ అయిన ఎంగిడి స్థానంలో బ్యాటర్ రూసో పంపడం వెనుక ఓ కారణం ఉంది. ఇప్పటికే విలియమ్స్ రూపంలో ఓ పేసర్ అందుబాటులో ఉండడంతో బ్యాటర్ను పంపారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101 నాటౌట్) శతకం బాదాడు. శ్రేయస్ అయ్యర్ (77) అర్ధశతకం చేయగా రోహిత్ శర్మ (40) రాణించాడు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, షంసీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో 27.1 ఓవర్లలో 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. ఆ జట్టులో మార్కో జాన్సెన్ (14) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు, సిరాజ్ ఓ వికెట్ తీశాడు.
Timed out in cricket : క్రికెట్లో టైమ్డ్ ఔట్ అంటే ఏమిటి..? బ్యాటర్ను ఇలా ఔట్ చేయొచ్చా..?