Qatar Court : 8 మంది మాజీ నావికాదళ సిబ్బందికి మరణశిక్షపై ఊరట.. భారత్ అప్పీల్ను అంగీకరించిన ఖతార్ కోర్టు
గూఢాచర్యం కేసులో భారత్ కు చెందిన ఎనిమిది మంది మాజీ నావికాదళ సిబ్బందిని ఖతార్ గూఢచార సంస్థ అరెస్టు చేసింది.
Qatar Court Accept India Appeal : గూఢాచర్యం కేసులో అరెస్టై ఖతార్ లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఊరట లభించింది. వీరికి విధించిన మరణశిక్షపై సమీక్ష చేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఖతార్ కోర్టు అంగీకరించింది. ఎనిమిది మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది మరణశిక్షపై భారత ప్రభుత్వం చేసిన అప్పీల్ను ఖతార్ ఆమోదించింది. అప్పీల్ను పరిశీలించిన తర్వాతే ఖతార్ కోర్టు విచారణ తేదీని నిర్ణయిస్తుందని వర్గాలు తెలిపాయి.
గూఢాచర్యం ఆరోపణల కేసులో గత నెల(అక్టోబర్)లో ఎనిమిది మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2022 ఆగస్టులో గూఢాచర్యం కేసులో భారత్ కు చెందిన ఎనిమిది మంది మాజీ నావికాదళ సిబ్బందిని ఖతార్ గూఢచార సంస్థ అరెస్టు చేసింది. కానీ, వారిపై ఉన్న ఆరోపణలను ఖతార్ అధికారులు ఇంకా బహిర్గతం చేయలేదు. వారి బెయిల్ పిటిషన్లను చాలాసార్లు తిరస్కరించారు. వారికి బెయిల్ ను తిరస్కరిస్తూ ఖతార్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
కాగా, వారికి కాన్సులర్ యాక్సెస్ మంజూరు చేశారు. భారత అధికారులు వారిని విడుదల చేయించడానికి కృషి చేస్తున్నారు. అరెస్టైన భారత నావికాదళ వెటరన్లు కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సెయిలర్ రాగేష్ గోపకుమార్ ఉన్నారు.
మాజీ నేవీ అధికారులందరూ ఇండియన్ నేవీలో 20 సంవత్సరాలు విశిష్ట సేవలను అందించినట్లు రికార్డు ఉంది. వారు ఫోర్స్లో బోధకులతోపాటు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఖతార్ అదుపులోకి తీసుకున్న మాజీ అధికారులలో ఒకరి సోదరి మీటూ భార్గవ తన సోదరుడిని తిరిగి భారత్ కు తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని జూన్ 8న ట్విట్టర్ పోస్ట్లో ఆమె విజ్ఞప్తి చేశారు.
Snake Bit : భార్య, రెండేళ్ల కూతుర్ని పాముకాటుతో చంపిన వ్యక్తి
ఇంకా ఆలస్యం చేయకుండా మాజీ నావికాదళ అధికారులను వెంటనే భారత్ కు తిరిగి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని మన గౌరవ ప్రధానమంత్రిని మరోసారి కోరుతున్నానంటూ ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లకు ఈ పోస్ట్ని ట్యాగ్ చేశారు.