MS Dhoni : 20 కిలోల బరువు తగ్గితే ఐపీఎల్లో తీసుకుంటానన్న ధోని.. కానీ అతడు మాత్రం..
MS Dhoni-Mohammad Shahzad : కొందరు క్రికెటర్లకు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ వారు ఫిట్నెస్ ను ఏ మాత్రం పట్టించుకోరు. ఈ జాబితాలోకే వస్తాడు అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షాజాద్.
![MS Dhoni : 20 కిలోల బరువు తగ్గితే ఐపీఎల్లో తీసుకుంటానన్న ధోని.. కానీ అతడు మాత్రం.. MS Dhoni : 20 కిలోల బరువు తగ్గితే ఐపీఎల్లో తీసుకుంటానన్న ధోని.. కానీ అతడు మాత్రం..](https://10tv.in/wp-content/uploads/2023/12/New-Project-4-11.jpg)
MS Dhoni -Mohammad Shahzad
ఇటీవల కాలంలో క్రికెటర్లు ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గాయాల బారిన పడకుండా ఉండాలంటే తమను తాము పిట్గా ఉంచుకునేందుకు చాలా శ్రమిస్తున్నారు. ఈ జాబితాలో అందరి కంటే ముందు వరసలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతడు మ్యాచ్ ఉన్నా లేకపోయినా జిమ్కు వెళ్లడం మాత్రం మరిచిపోడు. అయితే కొందరు క్రికెటర్లకు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ వారు ఫిట్నెస్ ను ఏ మాత్రం పట్టించుకోరు. ఈ జాబితాలోకే వస్తాడు అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షాజాద్.
చూడడానికి కొంచెం లావుగా ఉన్నప్పటికీ అద్భుమైన టాలెంట్ ఇతడి సొంతం. 35 ఏళ్ల ఈ క్రికెటర్ భారీ షాట్లను అవలీల కొట్టేస్తాడు. అఫ్గానిస్థాన్ క్రికెటర్లలో ఇతడు చాలా కీలకం. అఫ్గానిస్థాన్ తరుపున ఇప్పటి వరకు రెండు టెస్టులు, 84 వన్డేలు, 73 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 69 పరుగులు, వన్డేల్లో ఆరు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2727 పరుగులు, టీ20ల్లో ఓ సెంచరీ, 12 అర్ధశతకాలతో 2048 పరుగులు చేశాడు.
20 కిలోలు తగ్గమంటే..?
అతడు ఎంత బాగా ఆడుతున్నప్పటికీ అతడి బరువు గురించి ఎల్లప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మహ్మద్ షాజాద్ గురించి అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ భారత దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ప్రస్తుతం వైరల్గా మారింది. షాజాద్ గనుక 20 కిలోల బరువు తగ్గితే అతడిని ఐపీఎల్లో ఆడిస్తానని ధోని చెప్పాడని, అయితే.. షాజాద్ మాత్రం మరో ఐదు కిలోల బరువు పెరిగాడంటూ అస్గర్ ఆఫ్ఘన్ చెప్పాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
![Mohammad Shahzad](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/12/New-Project-5-14.jpg)
Mohammad Shahzad
2018 ఆసియా కప్లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ తరువాత నేను చాలా సేపు మహేంద్ర సింగ్ ధోనితో ముచ్చటించాను. అతడు అద్భుతమైన కెప్టెన్, టీమ్ఇండియా క్రికెట్కు అతడు దేవుడు ఇచ్చిన బహుమతి అని అస్గర్ అన్నాడు. ఆ సమయంలో మా మధ్య షాజాద్ గురించి చర్చ జరిగింది. ధోనికి షాజాద్ పెద్ద అభిమాని అని నేను చెప్పాను. అయితే.. షాజాద్కు పెద్ద పొట్ట ఉందని, అతడు ఓ 20 కిలోలు బరువు తగ్గితే ఐపీఎల్లో అతడిని తీసుకుంటామని ఆ సమయంలో ధోని చెప్పాడు. కాగా.. ఆ సిరీస్ తరువాత అఫ్గానిస్థాన్ వచ్చిన షాజాద్ మరో 5 కిలోల బరువు పెరిగినట్లు అస్గర్ చెప్పాడు.
టైగా ముగిసిన మ్యాచ్..
అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్ ఇంత వరకు భారత జట్టును ఎన్నడూ ఓడించలేదు. అయితే.. 2018లో జరిగిన ఆసియా కప్ లో తలపడినప్పడూ మాత్రం అఫ్గానిస్థాన్ దాదాపు విజయం సాధించినంత పని చేసింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. మహ్మద్ షాజాద్ 116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్ టైగా ముగిసింది.
Sreesanth : చిక్కుల్లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. లీగల్ నోటీసులు పంపిన ఎల్ఎల్సీ