పవిత్ర అయోధ్య రామాలయాన్ని చూసొద్దాం రండి..
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిరంలోని లోపలి చిత్రాలను చూసొద్దాం రండి....
Ram Temple in Ayodhya : రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిరంలోని లోపలి చిత్రాలను చూసొద్దాం రండి. రామమందిరంలోని గర్భగుడిని అత్యంత సుందరంగా నిర్మించారు. ఆలయ గోడలపై వివిధ శిల్పాలను చెక్కారు.
అందమైన శిల్పాలతో నిర్మించిన ఆలయం
దేవాలయంలో పాలరాతిని అందంగా వేశారు. వివిధ శిల్పాలతో కూడిన ఆలయ పిల్లర్లను రూపొందించారు. గోపురాన్ని శిల్పాలతో అందంగా తయారు చేశారు. రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతిపక్షాల అగ్రనేతలను కూడా ఆహ్వానించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు.
రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలు
ఆలయంలో సన్నాహాలను జనవరి 15వతేదీలోగా పూర్తి చేయాలని, జనవరి 16న ప్రాణప్రతిష్ఠ పూజ ప్రారంభమై జనవరి 22వతేదీన ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రతినిధులు చెప్పారు. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం వారం రోజుల పాటు జరిగే వేడుకల ప్రారంభానికి గుర్తుగా జనవరి 17న అయోధ్యలో 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముని జీవిత దృశ్యాలను ప్రదర్శించే టేబుల్లాక్స్ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంతం పచ్చని చెట్లతో అలరారుతోంది.
పచ్చని చెట్లతో అలరారుతున్న ఆలయం
70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ కాంప్లెక్స్లో 70 శాతం పచ్చని చెట్లతో ఉంటుందని రామమందిరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 600 చెట్లను గ్రీన్ బెల్ట్లో నాటారు. ఆలయంలో రెండు మురుగునీటి శుద్ధి కర్మాగారాలు,పవర్ హౌస్ నుండి ఒక ప్రత్యేక విద్యుత్ లైన్ ఉంటుంది.ఆలయంలోకి తూర్పు వైపు నుంచి భక్తులకు ప్రవేశం ఉంటుందని, దక్షిణం వైపు నుంచి నిష్క్రమించాలని ఆలయ ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
మూడు అంతస్తుల ఆలయం
మొత్తం ఆలయ నిర్మాణం మూడు అంతస్తులుగా ఉంది. సందర్శకులు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. సంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయాన్ని చూసిన భక్తులు భక్తిప్రపత్తులతో తన్మయత్యం చెందుతున్నారు.