Virat Kohli : 2024లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే.. వీటిలో ఎన్ని బద్దలు కొడతాడో..!
2024లో విరాట్ కోహ్లి పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అవి ఏంటో ఓ సారి చూద్దాం..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 2023లో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ముఖ్యంగా వన్డేల్లో దుమ్ములేపాడు. వన్డే ప్రపంచకప్2023లో 765 పరుగులు చేశాడు. దీంతో ఓ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా కోహ్లీ 2023లో మూడు ఫార్మాట్లలో కలిపి 35 మ్యాచులు ఆడాడు.
66.06 సగటుతో 78.31 స్ట్రైక్-రేట్తో 2048 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇదే ఫామ్ను 2024లోనూ విరాట్ కోహ్లీ కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా.. 2024లో విరాట్ కోహ్లి పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అవి ఏంటో ఓ సారి చూద్దాం..
* వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు కోహ్లీకి మరో 152 పరుగులు అవసరం. సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను 350 మ్యాచుల్లో అందుకోగా ఇప్పటి వరకు విరాట్ 292 మ్యాచులు ఆడాడు.
* టీ20ల్లో మరో 35 పరుగులు చేస్తే 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. పొట్టి ఫార్మాట్లో 12 వేల పరుగులు చేసిన మొదటి భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డుకు ఎక్కుతాడు. క్రిస్గేల్ (14,562), షోయబ్ మాలిక్ (12,993), కీరన్ పొలార్డ్ (12,390) లు విరాట్ కన్నా ముందు ఉన్నారు.
Mumbai Indians : ఐపీఎల్ 2024 నుంచి హార్దిక్ పాండ్య ఔట్..? ముంబై కెప్టెన్ ఎవరో తెలుసా..?
* ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో కోహ్లీ 544 పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (2535) పేరిట ఉంది.
* కోహ్లీ ఇంగ్లాండ్ పై మరో 30 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ పై అంతర్జాతీయ క్రికెట్లో 4వేల పరుగులు చేసిన మొదటి భారత బ్యాటర్గా నిలవనున్నాడు.
* న్యూజిలాండ్ పై మరో సెంచరీ చేస్తే కివీస్ పై అత్యధిక శతకాలు కొట్టిన భారత ప్లేయర్గా నిలుస్తాడు. ప్రస్తుతం సచిన్, కోహ్లీలు చెరో తొమ్మిది శతకాలతో సమానంగా ఉన్నారు.
* స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పేందుకు విరాట్కు ఐదు సెంచరీలు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (42 సెంచరీలు) పేరిట ఉంది.
* బంగ్లాదేశ్ పై టెస్టుల్లో కోహ్లీ మరో 383 పరుగులు చేస్తే ఆ దేశం పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (820 పరుగులు) పేరిట ఉంది.
* వెస్టిండీస్లో మరో 322 పరుగులు చేస్తే ఆదేశంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. 1919 పరుగులతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఈ రికార్డు ఉంది.