రికార్డు సెంచరీతో రీఎంట్రీని ఘనంగా చాటిన పృథ్వీ షా

గాయం నుంచి కోలుకుని 6 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు.

రికార్డు సెంచరీతో రీఎంట్రీని ఘనంగా చాటిన పృథ్వీ షా

Prithvi Shaw Marks Comeback With Historic Record In Ranji Trophy

Prithvi Shaw: టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా రికార్డు సెంచరీతో తన రీఎంట్రీని ఘనంగా చాటాడు. గాయం నుంచి కోలుకుని 6 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఈ డాషింగ్ ఓపెనర్ మునుపటి తరహలోనే చెలరేగాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరపున ఆడుతున్న 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్ సెంచరీతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్‌తో శుక్రవారం రాయ్‌పూర్‌లో రంజీ ట్రోఫీ గ్రూప్ B మ్యాచ్‌లో ఓపెనర్ గా బరిలోకి దిగి సత్తా చాటాడు. లంచ్‌కు ముందే మూడు అంకెల స్కోరు సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో మొదటి రోజే ఓపెనింగ్ సెషన్‌లో రెండు సెంచరీలు సాధించిన మొదటి ఇండియన్ బ్యాటర్ గా రికార్డుకెక్కాడు.

ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్ లో 85 బంతుల్లో 18 బౌండరీలు, 3 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. లంచ్‌కు ముందే అతడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అస్సాం జట్టుపై కూడా ఇదే విధమైన ఫీట్‌ను సాధించాడు. ఆ మ్యాచ్ లో మరో రికార్డు కూడా తన పేరిట లఖించుకున్నాడు. 383 బంతుల్లో 379 పరుగులు చేసి.. ఆల్ టైమ్ రంజీ ట్రోఫీలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. 2018లో ప్రపంచ కప్ గెలిచిన U-19 జట్టుకు కెప్టెన్‌గా పృథ్వీ షా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

భుపేన్ లాల్వానీ సెంచరీ
ఇక తాజా మ్యాచ్ విషయానికి వస్తే ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 101.4 ఓవర్లలో 351 పరుగులు ఆలౌటైంది. పృథ్వీ షాతో పాటు ఓపెనర్ గా దిగిన భుపేన్ లాల్వానీ కూడా సెంచరీ చేశాడు. 238 బంతుల్లో 10 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 244 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ముంబై 351 పరుగులకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్ ఆశిష్ చౌహాన్ 6, రవి కిరణ్ 3 వికెట్లు పడగొట్టారు. విశ్వాస్ మాలిక్ ఒక వికెట్ తీశాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ B స్టాండింగ్‌లో ముంబై ముందంజలో ఉంది. ఆంధ్ర జట్టు కంటే 5 పాయింట్లు ఆధిక్యంలో ఉంది.

Also Read: ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే.. కోహ్లీని ఎందుకు పక్కన పెట్టారంటే?