IAS Poorna Sundari : ఐఏఎస్ పూర్ణ సుందరి సక్సెస్ స్టోరీ : కంటిచూపు లేకున్నా ఆడియో క్లాసులు విని.. ఐఏఎస్ కలను సాధించింది!
IAS Success Story : చూపులేకుంటే ఏంటి? ఆత్మస్థైరమే ఆమెకు కొండంత బలం.. అదే సివిల్స్లో సత్తా చాటేలా చేసింది. పట్టుదలతో కష్టపడి చదివి ఐఏఎస్ కలను సాధించిన మధురైకి చెందిన పూర్ణ సుందరి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే..
IAS Poorna Sundari : అత్యంత క్లిష్టమైన సివిల్స్లో సత్తా చాటాలంటే సాధారణ విషయం కాదు.. అందుకు ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. ఎన్ని సవాళ్లు, అపజయాలు ఎదురైనా వెనుకంజ వేయకూడదు. అయితే, ఇది అందరికి సాధ్యమేనా? అంటే సాధ్యమే.. యూపీఎస్సీ పరీక్షలో విజయానికి తొలిమెట్టు.. ‘అనుకుంటే ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసమే..’ కానీ, చాలామంది అన్ని బాగున్నా అనుకున్న లక్ష్యాన్ని చేరడంలో విఫలమవుతుంటారు. అపజయాలు ఎదురైనా వెంటనే వెనక్కి తగ్గుతారు. దానికి ఏదో సాకు వెతుక్కుంటారు.
కానీ, మధురైకి చెందిన పూర్ణ సుందరి అలా కాదు.. ఎందుకంటే.. ఆమెకు అందరిలా కంటిచూపు లేదు. దురదృష్టవశాత్తూ ఆమెకు ఐదేళ్ల వయస్సులోనే కంటిచూపు పోయింది. తాను చూడలేనని ఎప్పుడూ కూడా ఆమె అధైర్యపడలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోలేదు. జీవితంలో అపజయాలు ఎదురైనా తన దృష్టిలోపాన్ని ఎప్పుడు కూడా సాకుగా చెప్పుకోలేదు. దాన్ని తలుచుకుని బాధపడలేదు. ఆ లోపాన్నే ఆత్మబలంగా మార్చుకుంది. ఒక్కో అడుగు ముందుకు వేసింది.
Read Also : 35 సార్లు ఫెయిల్.. ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు.. ఆపై ఐఏఎస్ అధికారిగా.. సక్సెస్కు చిరునామా ఇతడే!
నాల్గో ప్రయత్నం.. 2019లో 286 ర్యాంకు :
యూపీఎస్సీ పరీక్ష కోసం పట్టుదలతో కష్టపడి చదివింది. తల్లిదండ్రులు కూడా ఆమెకు కొండంతధైర్యంగా నిలిచారు. వారి ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా యూపీఎస్సీకి పరీక్ష కోసం ప్రీపేర్ అయింది. అందరిలా చూడలేకపోయినా.. ఆడియో క్లాసుల ద్వారా విని నేర్చుకుని అత్యంత కష్టతరమైన సివిల్స్ను సాధించింది మధురై అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకుంది పూర్ణ సుందరి. యూపీఎస్సీ పరీక్షలను చాలామంది ఛేదించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయ్యారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన పూర్ణ సుందరి ఒకరు. 2019 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 286వ ర్యాంక్ సాధించింది. నాల్గవ ప్రయత్నంలో మాత్రమే ఆమె విజయం సాధించింది. అంతకుముందు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.
చూపు లేకున్నా.. కుటుంబాన్ని ఆదుకోవాలని.. :
ఐఏఎస్ పూర్ణ సుందరి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా ఆమె కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. పూర్ణ తండ్రి సేల్స్ ఎగ్జిక్యూటివ్, తల్లి ఇంటి పనులు చేస్తుండేవారు. ఇద్దరూ కష్టపడుతూ తమ కూతుర్ని కష్టపడి చదివించారు. వీరి సంపాదనతో ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితిని అనుభవించారు. కన్న కూతురికి చూపులేదని ఎన్నోసార్లు బాధపడ్డారు. కానీ, పూర్ణ మాత్రం అధైర్యపడకుండా తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. తాను కష్టపడి చదువుకుని కుటుంబాన్ని పోషించాలని నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ పరీక్ష కోసం పట్టుదలతో చదివింది. చివరికి ఐఏఎస్ సాధించి కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకుంది.
పుట్టినప్పటినుంచి అంధురాలు కాదు :
సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు పూర్ణకు 25 ఏళ్లు. ఆమెది తమిళనాడులోని మధురై స్వస్థలం. పూర్ణ పుట్టినప్పటి నుంచి అంధురాలు కాదు. ఐదేళ్లు నిండిన తర్వాత అనారోగ్య సమస్య కారణంగా కంటినరాలు బలహీనపడి ఆమె కంటిచూపు కోల్పోయింది.
యూపీఎస్సీకి ఇలా ప్రీపేర్ అయింది :
సివిల్స్లో విజయం అనంతరం పూర్ణ తన యూపీఎస్సీ ప్రయాణం ఎలా సాగిందో చెప్పుకొచ్చింది. సివిల్స్ ప్రీపరేషన్ సమయంలో తాను ఆడియో ఫార్మాట్లో అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్ సాయం తీసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా ల్యాప్టాప్లో స్పీకింగ్ సాఫ్ట్వేర్ సాయం కూడా తీసుకుంది.
తల్లిదండ్రుల మద్దతు :
సివిల్స్ విజయంలో తన తల్లిదండ్రులు చాలా మద్దతుగా నిలిచారు. ఈ విజయాన్ని వారికి అందించాలనుకుంది. యూపీఎస్సీ మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైంది. చివరికి నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమైంది. సివిల్స్ సాధించడానికి తనకు దాదాపు 5 ఏళ్లు పట్టింది. పూర్ణ తల్లిదండ్రులు కూడా అనేక పుస్తకాలు అందించి చదివించారు. అంతేకాదు.. తన స్నేహితులు, సీనియర్లు కూడా పూర్ణకు మద్దుతుగా నిలిచి ప్రోత్సాహాన్ని అందించారు. అలా యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేసి ఐపీఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచింది.