Mlc Kavitha Interrogation : వాళ్లిద్దరితో కుమ్మక్కయ్యారా? ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

కవిత అరెస్ట్ సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Mlc Kavitha Interrogation : వాళ్లిద్దరితో కుమ్మక్కయ్యారా? ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

Mlc Kavitha Interrogation

Mlc Kavitha Interrogation : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 5వ రోజు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా కేసులో నిందితులు ఇచ్చిన వాంగూల్మాల ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు. రోజుకు దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ప్రశ్నిస్తున్న ఈడీ.. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తోంది.

నిన్న కవిత పీఏలు రాజేశ్, రోహిత్ లను ప్రశ్నించిన ఈడీ అధికారులు కవిత అరెస్ట్ సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో రోజూ కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కవిత ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే తింటున్నట్లు సమాచారం. ఇవాళ కవితను ఆమె తల్లి శోభ, పిల్లలు, ఇతరు కుటుంబసభ్యులు కలిసే అవకాశం ఉంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇవాళ 5వ రోజు విచారించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్-19 కింద కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వుల మేరకు కవిత వారం రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు. కవిత నుంచి అనేక సమాచారం సేకరించాల్సి ఉంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, మనీశ్ సిసోడియా-కేజ్రీవాల్ తో ఉన్న ఒప్పందాలు, సౌత్ గ్రూప్ పాత్రకు సంబంధించిన అంశాలపైన కవితను ప్రశ్నించాల్సి ఉంది.

గతంలో కవిత అనేక ఆధారాలను డెస్ట్రాయ్ చేశారు, ఫోన్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారు, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పుడు సమాచారం ఇచ్చారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈడీ వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగా కోర్టు కవిత కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం 5వ రోజు కవితను ఈడీ అధికారులు విచారించారు.

అటు కేసీఆర్ సైతం రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి, విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భంగా.. కవితను ఏయే ప్రశ్నలు అడిగారు, కవిత కేసు దర్యాఫ్తునకు సహకరించారా? లేదా? అన్నది కోర్టుకు ఈడీ తెలియజెప్పే అవకాశం ఉంది.

మార్చి 23వ తేదీతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. కస్టడీలో కవిత తమకు సహకరించారని ఈడీ అధికారులు చెబితే.. ఇక్కడితో ఈడీ కస్టడీ ముగుస్తుంది. తదుపరి న్యాయపోరాటానికి సంబంధించి ఏం జరగనుంది? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కస్టడీలో కవిత తమకు సహకరించలేదని ఈడీ అధికారులు కనుక కోర్టుకు చెబితే మాత్రం.. కస్టడీని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : నా మొబైల్ ఫోన్‌ను బలవంతంగా సీజ్ చేశారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్