RCB : కోహ్లికి సాయం చేసిన పంత్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు లైన్ క్లియర్..! ఇక మిగిలింది చెన్నై ఒక్కటే..
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.
Royal Challengers Bengaluru : ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ప్లే ఆఫ్స్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరుకుంది. మిగిలిన రెండు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్లు పోటీలో ఉన్నాయి.
ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ సాంకేతికంగా పోటీలో ఉన్నప్పటికీ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ అన్ని మ్యాచులు ఆడేసింది. 14 పాయింట్లతో ఉంది. నెట్ రన్రేట్ మైనస్లో ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో విజయం సాదించినా కూడా 14 పాయింట్లతో ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్రేట్ మైనస్లో ఉంది. దాన్ని మెరుగు పరచుకోవాలంటే ఆఖరి మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.
అంటే రెండు స్థానాల కోసం మూడు జట్ల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో కనీసం ఒక్క దానిలో విజయం సాధించినా ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్కు వెలుతుంది. ఈ క్రమంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కీలకంగా మారనుంది.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే..?
ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే ఇలా జరగాల్సి ఉంటుంది. చిన్నస్వామి వేదికగా మే 18 శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో బెంగళూరు తప్పక విజయం సాధించాలి. మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతోనూ లక్ష్య ఛేదన అయితే 18.1 వ ఓవర్ లోపే విజయం సాధించాల్సి ఉంటుంది. అలా అయితే.. చెన్నై కంటే మెరుగైన రన్రేట్ను సాధించి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టనుంది.
ఒకవేళ పై కండిషన్ విఫలమై.. చెన్నై పై నామమాత్రంగానే గెలిచినా కూడా అవకాశం ఉంటుంది. అయితే.. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు చెన్నై, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ పాయింట్లు 14గా ఉంటాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్ కంటే ఆర్సీబీ మెరుగైన రన్రేటు కలిగి ఉంటే చెన్నై, ఆర్సీబీ రెండూ ప్లే ఆఫ్స్లో అడుగుపెడతాయి.
మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కాకుండా లక్నో గెలిచినట్లయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోవడం దాదాపుగా అసాధ్యంగా మారేది.