IND vs SL : శ్రీలంక‌తో మూడో టీ20కి ముందు.. భార‌త్‌కు గట్టి ఎదురుదెబ్బ‌..

శ్రీలంక‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ కైవ‌సం చేసుకుంది.

IND vs SL : శ్రీలంక‌తో మూడో టీ20కి ముందు.. భార‌త్‌కు గట్టి ఎదురుదెబ్బ‌..

Shubman Gill

India vs Srilanka : శ్రీలంక‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ కైవ‌సం చేసుకుంది. నామ‌మాత్ర‌మైన మూడో టీ20 మ్యాచ్ నేడు (మంగ‌ళ‌వారం జూలై 30న‌)జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని కొత్త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌, న‌యా కోచ్ గౌత‌మ్ గంభీర్‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ త‌గిలింది. వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మూడో టీ20కి దూరం కానున్న‌ట్లు స‌మాచారం.

మెడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో రెండో టీ20కి దూరం అయిన గిల్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆగ‌స్టు 2 నుంచి మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆఖ‌రి టీ20కి గిల్‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. తొలి టీ20లో 16 బంతుల్లో 34 ప‌రుగులు చేసిన గిల్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. గిల్ దూరం కానుండ‌డంతో రెండో టీ20 మ్యాచ్‌లో గోల్డెన్ డ‌కౌట్ అయిన‌ప్ప‌టికి కూడా సంజూ శాంస‌న్ మ‌రోసారి ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి.

MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?

ఆగ‌స్టు 2, 4, 7 తేదీల్లో శ్రీలంక‌తో భార‌త్ మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. కొలంబో వేదిక‌గా ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగనుంది. ఇప్ప‌టికే వ‌న్డే జ‌ట్టులోని ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, హ‌ర్షిత్ రాణా వంటి ఆట‌గాళ్లు శ్రీలంక‌కు చేరుకుని ప్రాక్టీస్ మొద‌లెట్టారు.