హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు.. కానీ, వాళ్ల జోలికెళ్తే ఊరుకోం : బండి సంజయ్

కార్యకర్తలారా.. రామరాజ్యం స్థాపనకోసం నడుం బిగించి పోరాడండి. ఏ స్వార్ధ్యం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలు.

హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు.. కానీ, వాళ్ల జోలికెళ్తే ఊరుకోం : బండి సంజయ్

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar : కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద డ్రామా కంపెనీ.. రుణమాఫీ సర్వే పేరుతో మళ్లీ కాంగ్రెస్ డ్రామాలు స్టార్ట్ చేసింది. రుణమాఫీ ఎంతమందికి వర్తించింది. ఇంకా అర్హులెందరున్నారో బ్యాంకుల వద్ద అన్ని వివరాలుండగా మళ్లీ సర్వే ఎందుకు? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రుణమాఫీపై కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల డ్రామాలు ఆడుతుంది. ఆరు గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు..  హైడ్రా కూల్చివేతలు, విగ్రహాల లొల్లి, రుణమాఫీ సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని సంజయ్ విమర్శించారు.

Also Read : రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చిన సీఎం

ఒవైసీకి ఓ న్యాయం.. ఇతరులకు ఓ న్యాయమా?
హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు. కానీ పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని సంజయ్ అన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఓ న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అంటూ సంజయ్ ప్రశ్నించారు. మా సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని ఓవైసీ బెదిరిస్తే చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గులేదా?. ఒవైసీ అరాచకాలను అణిచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే పాతబస్తీ నుండి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటామని సంజయ్ అన్నారు.

బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదు..
ఎస్టీలపై బీఆర్ఎస్ చేసిన అరాచకాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళితే బీఆర్ఎస్ చేసిన దాడుల్లో రైతులు, కార్యకర్తల తలలు పగిలిన దారుణ సంఘటనను మర్చిపోదామా? ప్రజా సంగ్రామ యాత్రపై బీఆర్ఎస్ గూండాలు దాడిచేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఘటనను మరువలేం. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిగ్గులేకుండా బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. బీఆర్ఎష్ విలీనం ప్రసక్తే లేదు. ఆ పార్టీ అంతు చూస్తాం. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని సంజయ్ అన్నారు.

 

కష్టపడే కార్యకర్తలకు టిక్కెట్లు ..
తెలంగాణలో రామరాజ్యం తథ్యం. కార్యకర్తలారా.. రామరాజ్యం స్థాపనకోసం నడుం బిగించి పోరాడండి. ఏ స్వార్ధ్యం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అతితక్కువ కాలంలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలన్నదే పార్టీ లక్ష్యమని అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదును కార్యకర్తలంతా సీరియస్ గా తీసుకోవాలి. సామాన్య కార్యకర్తలు ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగిన చరిత్ర ఒక్క బీజేపీలోనే సాధ్యం. నేను ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదు. 2019కి ముందు నార్త్ బ్లాక్ లోకి వెళ్లలేక బయట నుండే సెల్ఫీ తీసుకున్న చరిత్ర నాది. నేడు అదే నార్త్ బ్లాక్ లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న. గుర్తింపుకోసం ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు. కష్టపడి కమిట్ మెంట్ తో పనిచేస్తే బీజేపీలో గుర్తింపు తధ్యమని సంజయ్ అన్నారు. స్థానిక సంస్థల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులంతా… మీమీ గ్రామాలు, మండలాల్లో అత్యధిక సభ్యత్వం చేయించండి, బీజేపీకి, ఇతర పార్టీలకు ఉన్న తేడాను వివరించి బీజేపీలో సభ్యులుగా చేర్చండి. దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్. సిద్దాంతం కోసం మంత్రి పదవులనే వదులుకున్న పార్టీ బీజేపీ అని సంజయ్ అన్నారు.