ఒంటిపై బంగారం ఉన్న ఒంటరి మహిళలే టార్గెట్, షికారీ గ్యాంగ్ ను చాకచక్యంగా పట్టుకున్న అనంత పోలీసులు

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 04:33 PM IST
ఒంటిపై బంగారం ఉన్న ఒంటరి మహిళలే టార్గెట్, షికారీ గ్యాంగ్ ను చాకచక్యంగా పట్టుకున్న అనంత పోలీసులు

shikari gang: ఒంటరిగా ఉన్న మహిళలే వారి టార్గెట్‌.. మహిళల ఒంటిపై బంగారం ఉంటే ఇక వారి టార్గెట్‌ ఫిక్స్ అయినట్లే.. నగలు, డబ్బూ ఇవ్వమంటూ బెదిరిస్తారు.. లేదంటే చంపేస్తామంటారు.. దేనికీ వినకపోతే కొట్టి భయపెట్టి నగలు లాక్కొని వెళ్లిపోతారు. ఇలాంటి అంతర్రాష్ట్ర దొంగల ఆట కట్టించారు అనంతపురం జిల్లా పోలీసులు.

బైక్ పై వచ్చి రెక్కీ, ఒంటరిగా ఉన్న సమయంలో దోపిడీ:
ఇది సుపారీ గ్యాంగ్‌ కాదు.. షికారీ గ్యాంగ్‌.. హైవేపై బైక్‌ మీద వచ్చి రెక్కీ చేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళల కోసం వెతుకుతారు. వాళ్ల పనికి అడ్డొస్తే చంపేయడానికి కూడా వెనకాడరు. అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలోని మణికంఠ కాలనీలో టీ సెంటర్‌ నడుపుతున్న ఓ వృద్ధురాలిపై ఈ షికారీ గ్యాంగ్‌ కన్ను పడింది. వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేసి మెడలోని గొలుసు, కమ్మలు, ఉంగరం లాక్కొని బైక్‌పై పరారయ్యారు ఇద్దరు దుండగులు.

సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దొంగలు అరెస్ట్:
దొంగతనం విషయంపై సోమందేపల్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేసిందీ బాధితురాలు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల వేటలో పడ్డారు. టీ స్టాల్‌ చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాలు పరిశీలించారు. నిందితులు షేక్‌ తాలీబ్‌, షేక్‌ హసన్‌గా గుర్తించారు పోలీసులు. సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఇద్దరూ రెక్కీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి ఓ బైక్‌, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐ వెంకటరమణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.