ఈ రాత్రికి ఢిల్లీలోనే జగన్ : అమిత్ షాతో భేటీలో ఏం చర్చిస్తారు!
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మండలి రద్దు, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై షాతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఈ రాత్రి (శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020)కి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్నారు.
రేపు (శనివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ కానున్నారు. కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్, రవిశంకర్ ప్రసాద్ లను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీతో భేటీలో ఆయా అంశాలపై వివరించిన జగన్.. కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయి ఏపీలో కీలక అంశాలను అధికారికంగా కేంద్రం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కేంద్ర మంత్రులంతా రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించి అంశాలపై స్పందించే అవకాశం ఉంది. ఇదే సరైన సమయమని భావించిన సీఎం జగన్.. ఏపీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డారు. ముందుగా కేంద్ర మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో వైఎస్ జగన్ కలవనున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాష్ట్రం తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే విషయాలపై కూడా అమిత్ షాతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఈ రాత్రికి (శుక్రవారం) ఢిల్లీలోనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే మిగతా కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారికంగా సమాచారం లేదు.
Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు