DGP Rajendranath Reddy: చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోంది.. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు
చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నామని, పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు.
Chandrababu Arrest : చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రబాబు పేరుతో బయటకు వచ్చిన లేఖ పై విచారణ జరుగుతుంది.. ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం తెలిస్తే చర్యలు ఉంటాయని డీజీపీ తెలిపారు. జైలు అధికారికి తెలియకుండా ఎలాంటి లేఖలు రావని అన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు. వారు స్వేచ్ఛగా తమ నిరసన తెలుపుతున్నారు. అయితే, నిరసన సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడే చర్యలు ఉంటాయని డీజీపీ తెలిపారు.
పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు. భువనేశ్వరి యాత్రకోసం మమ్మల్ని ఎవరూ కలవలేదు. మమ్మల్ని సంప్రదిస్తే ఆలోచిస్తామని డీజీపీ అన్నారు. క్రికెట్ బెట్టింగ్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇప్పటికే కీలకమైన వ్యక్తులను అరెస్టులు చేశామని డీజీపీ తెలిపారు. తెలంగాణ ఎన్నికల కోసం సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు పెట్టామని చెప్పారు.