మా జగనన్న స్ట్రైకింగ్ సీయం, బాబులాగా స్టిక్కర్ సీయంకాదు
jagananna vidya deevena:జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తుంటే, తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు, కడుపుమంటతో రగిలిపోతున్నారని ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
జగన్ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలు, తల్లిదండ్రుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఫలితమే జగనన్న విద్యా కానుకన్నారు సురేష్. పిల్లవాడు ఎంతో సంతోషంగా బ్యాగ్ ను తగిలించుకుని వెళ్తుంటే, ప్రతిపక్షాలకు కడుపు రగిలిపోతూ, జగనన్న విద్యా కానుక మీద అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు.
ఇది కేంద్రపధకమే అయితే, 60శాతం నిధులు వస్తే, ఎక్కడైనా ఇలాంటి పథకం అమలు చేశారా? షూస్, స్కూల్ బ్యాగ్స్, వర్క్ బుక్స్ ఇచ్చారా? అని టీడీపీని ఛాలెంజ్ చేశారు.
రూ.650 కోట్లజగనన్న విద్యా కానుక పథకంతో 43లక్షల మంది విద్యార్ధులు లాభపడ్డారు. ఇది నూటికి నూరు శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచే సమకూర్చుతున్నామని అన్నారు సురేష్.
మా జగనన్న స్ట్రైకింగ్ సీయం
రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే, ప్రతిపక్షం ఏడుస్తుంది. కాబట్టే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. బట్ట కాల్చి ముఖం మీద వేసే నైజం చంద్రబాబుదని విరుచుకుపడ్డారు. మిగతా రాష్ట్రాలూ జగనన్న విద్యా కానుక విధానాన్ని ఫాలో అవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయని గొప్పగా చెప్పారు.
మీ బిడ్డలకో ఒక న్యాయం..
పేద, దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీ బిడ్డలకు ఒక న్యాయమా? మీ బిడ్డలు మాత్రం కాన్వెంట్కు యూనిఫామ్, షూ, సాక్స్, బెల్టు, బ్యాగ్ వేసుకుని వెళ్లాలి, ప్రభుత్వ పాఠశాల పేద, బడుగుబలహీన, అణగారిన వర్గాల వారి పిల్లలు మాత్రం, చిరిగిపోయిన యూనిఫామ్తో, చిరిగిన బ్యాగ్తో, తెగిన చొప్పులతో, పుస్తకాలు, నోట్ బుక్స్ లేకుండా పోవాలా? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి సమానత్వం, ఇదెక్కడి మానవతావాదమని ప్రశ్నించారు.
జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే…
ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలేమిటో, విశ్వసనీయత, నిబద్దత ఏమిటో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. మేం చేసే కార్యక్రమాలు ప్రతీది చెప్తాం, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా చెప్తాం. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు, దాపరికం లేదని తేల్చేశారు.