చంద్రబాబు నోట పదేపదే జమిలి ఎన్నికల మాట.. దాని వెనుక వ్యూహం ఇదేనా?

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 02:50 PM IST
చంద్రబాబు నోట పదేపదే జమిలి ఎన్నికల మాట.. దాని వెనుక వ్యూహం ఇదేనా?

jamili elections: దేశంలో వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల కారణంగా అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ విషయం గురించి బీజేపీ కూడా పెద్దగా ఎక్కడా మాట్లాడుతున్న సందర్భం లేదు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పదే పదే కార్యకర్తలకు ఈ విషయాన్ని చెబుతున్నారు. 2022లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

జమిలి ఎన్నికల గురించి పదే పదే చెబుతున్న చంద్రబాబు:
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ చిన్న విషయమేమీ కాదు. దీని కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. లోక్‌సభ నుంచి స్థానిక సంస్థ ఎన్నికలు వరకు ఒకేసారి నిర్వహించడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయనేది ఈ స్లోగన్ ప్రథమ ఉద్దశం. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత జమిలి ఎన్నికల మాట పెద్దగా తెరపైకి రాలేదు. కానీ, చంద్రబాబు పదే పదే జమిలి ఎన్నికలు జరుగుతాయని చెబుతుండడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా జమిలి గురించి ప్రస్తావించడం ఢిల్లీ నుంచి ఏమైనా లీక్‌ చేశారా అన్న డిస్కషన్‌ మొదలైంది.
https://10tv.in/minister-anil-fires-on-chandrababu-over-polavaram/
ఇప్పుడున్న ప్రభుత్వం శాశ్వతం కాదు, రెండేళ్లలో జమిలి ఎన్నికలు:
రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం శాశ్వతం కాదని, రెండేళ్లలో జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయని చంద్రబాబు అంటున్నారు. చాలా రోజులుగా చర్చలో లేని ఈ విషయాన్ని బాబు మళ్లీ తెరపైకి తేవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధినేతకు ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఏదో ఉండి ఉంటుందని కొందరు నేతలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో బీజేపీ నేతలతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

కేంద్ర పెద్దలతో టచ్ లో చంద్రబాబు:
పరామర్శల పేరున కొందరితో, ఇతర వ్యవహారాలపై మరికొందరితో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు బాబు చేసిన కామెంట్లపై ఆసక్తి నెలకొంది. కేంద్ర పెద్దల నుంచి జమిలి ఎన్నికలపై చంద్రబాబుకు ఏదో చిన్నపాటి సమాచారం అయినా ఉండే ఉంటుందని, లేకుంటే దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా వ్యాఖ్యానించరని కొందరు నేతలు అంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను ఫోన్లో పరామర్శించారు చంద్రబాబు. అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగా ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారు. ఈ సందర్భంలో జమిలికి సంబంధించిన సమాచారం చంద్రబాబుకి ఏమైనా అందిందా అనే అనుమానాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతలపై కేసులు, అరెస్టులు:
చంద్రబాబు వ్యాఖ్యలను లోతుగా పరిశీలించిన వారిలో మరో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్బలంతో పెద్ద ఎత్తున తమ పార్టీ వారిపై కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వ్యాపారాలను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. పోలీసుల ద్వారా వేధిస్తున్నారని అంటోంది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు అరెస్టు కాగా… పదుల సంఖ్యలో నేతలపై, వారి వ్యాపారాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో చాలామంది నేతలు, కేడర్‌ సైలెంట్ అయిపోగా ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు.

కేడర్ ని కాపాడుకోవడం కోసమేనా?
కొందరు నేతలు ఇప్పటికే పార్టీలు మారగా మరికొందరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు కూడా కొంత ఆందోళన చెందారు. ఇప్పుడు జమిలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలకు….. పార్టీలోని పరస్థితులకు లింక్ ఉందనే చర్చ కూడా జరుగుతోంది. రెండేళ్లలో ఎన్నికలని ప్రస్తావించడం ద్వారా కేడర్‌తో పాటు లీడర్లు కూడా చేజారకుండా చూసుకోవచ్చనేది అధినేత వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. మరో మూడున్నరేళ్ల ఎలా అంటూ ఆలోచనలో ఉన్నవారికి బాబు వ్యాఖ్యలు పునరాలోచనలో పడేసే అవకాశం ఉందని పార్టీ లెక్కలు వేస్తోంది.

కేడర్ ని ఉత్సాహపరిచేందుకు చంద్రబాబు వ్యూహం:
2019 వరకు పదవులు అనుభవించిన చాలామంది ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ జమిలి అనే చర్చ ద్వారా వారందరినీ ఎంతో కొంత ఉత్సాహపరిచేందుకే చంద్రబాబు ఈ వ్యూహం పన్నారని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం పెడుతున్న కేసుల విషయంలో అధికారులను హెచ్చరించడంతో పాటు పార్టీ నేతల్లో ఒక విశ్వాసాన్ని నింపడమే తమ అధినేత చంద్రబాబు ఉద్దేశమని అంటున్నారు. జమిలీ ఎన్నికల పేరుతో కేడర్‌ని అలర్ట్ చేద్దాం అనుకుంటున్న చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.