Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రజల తరపున గళం వినిపిస్తున్న బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరంలో హింస జరిగిందని చెప్పారు. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమేనని అన్నారు.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

CHANDRABABU

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రజల తరపున గళం వినిపిస్తున్న బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరంలో హింస జరిగిందని చెప్పారు. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమేనని అన్నారు.

ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని అన్నారు. మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు, ప్రతి పక్షాలు ప్రశ్నించకుండా చేయడానికే హింసను ప్రేరేపిస్తున్నారని తెలిపారు. జగన్ రాజకీయ కక్ష సాధింపులో పోలీసులు పావుల్లా మారుతున్నారని అన్నారు.

శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, తన వికృత రాజకీయానికి జగన్ వారిని పావులుగా వాడుకున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వ్యక్తిగతంగా కేసు పెట్టేందుకు అర్హత లేకపోయినప్పటికీ.. క్రిస్టియన్ అయిన గన్నవరం సీఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థం అవుతుందని అన్నారు.

గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా… ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ధి స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ప్రజల నుంచి రూ.1,100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ధి స్కాంలో ఇతను నిందితుడని తెలిపారు. గన్నవరం ఘటనలో బాధితులైన తెలుగు దేశం వారినే నిందితులుగా చేయడం దారుణమని అన్నారు.

ప్రశ్నిస్తే అక్రమ కేసులు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఇందుకు గన్నవరం విధ్వంసం, తరువాత పరిణామాలు తాజా ఉదాహరణ అని అన్నారు. బాధితులనే నిందితులుగా మార్చి, జైలుకు పంపిన వైనంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పారు. జగ్గంపేట, పెద్దాపురంలో మా పర్యటనల అనంతరం… ప్రజా స్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం…అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించిందని లేఖలో పేర్కొన్నారు. ఆంక్షలు, నిర్బంధాలు ఉన్నా దండి మార్చ్ స్ఫూర్తితో అద్భుతంగా జరిగిన అనపర్తి సభతో జగన్ ఉలిక్కిపడ్డారని తెలిపారు. గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపారని చెప్పారు.

హింసాత్మక ఘటనలతో ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కక పోతే ఇక లాభం లేదని భావించి.. గన్నవరం విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు. గన్నవరంలో స్థానిక శాసన సభ్యుడి అరాచకాలను, సంకల్ప సిద్ధిొ స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ప్రశ్నించినందుకే దాడులు చేశారని అన్నారు. రోజంతా వైసీపీ మూకలు దాడులు చేస్తున్నా పోలీసులు తమ బాధ్యతలు వదిలేశారని చెప్పారు. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయినా.. పక్కా ఆధారాలు దొరికినా కారకులపై చర్యలు లేవని అన్నారు. యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పారు.

కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో వైసీపీ శ్రేణులు, వారికి నాయకత్వం వహిస్తున్న గూండాలు స్వైరవిహారం చేసినా పోలీసులు వారిని కనీసం నిలువరించలేదని తెలిపారు. ఘటనలో 40 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారని తెలిపారు. తగలబడిన కార్లు తెలుగుదేశం నేతలవని చెప్పారు. పోలీస్ టార్చర్ అనుభవించింది కూడా తెలుగుదేశం వారే, బాధితులూ తెలుగుదేశం వాళ్లేనని చెప్పారు. అయినప్పటికీ, పోలీసులు తప్పుడు ఆరోపణలతో చివరకు జైల్లో పెట్టింది తెలుగుదేశం వాళ్లనేనని అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నదని చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనిలో కొంత మంది కళంకిత పోలీసు అధికారులు భాగస్వాములు కావడం విచారకరమని చెప్పారు. ఈ తరహా దాడులు, విధ్వంసాలతో ఈ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని తెలిపారు. తద్వారా తమను ఎవరూ ఎదిరించకూడదనే భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

ఈ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేది వారి కుట్ర అని తెలిపారు. బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరిచి…ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడ నుంచి కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి… ప్రజాస్వామ్యానికి, నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోందని చంద్రబాబు నాయుడు చెప్పారు.

TSRTC: ఒడిశా-తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం.. ఇరు రాష్ట్రాల మధ్య 23 బస్సులు