స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర నుంచి సానుకూల ప్రకటన వస్తుంది – సీఎం జగన్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర నుంచి సానుకూల ప్రకటన వస్తుంది – సీఎం జగన్

CM YS Jagan meeting with visakha steel plant JAC Leaders : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిచే అంశంలో కేంద్రం  నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పార. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ఆయన  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులకు తెలిపారు. ఇప్పటికే ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ఆయన గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విశాఖపట్టణంలో బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

సుమారు గంట 20 నిమిషాల పాటు సీఎం జగన్‌ కార్మిక నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానికి రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కు అవసరమైన గనులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్ఎండీసీతో గనులతో జరిగిన ఒప్పందంపై పునఃసమీక్ష ఇస్తామని సీఎం చెప్పారు. పొస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు.

పోస్కో ప్రతినిధులు తనను కలిశారని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించినట్లు తెలిపారు. కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోర్టుల వద్ద ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని కార్మిక నాయకులతో సీఎం జగన్‌ తెలిపారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

సమావేశం అనంతరం కార్మిక సంఘ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ… గంటకుపైగా కొనసాగిన సమావేశంలో సీఎం జగన్‌ మాటలతో తమకు భరోసా వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్టు అయ్యిందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖతోపాటు విశాఖ ఉక్కుకు అవసరమైన గనులపై చర్చించినట్లు వివరించారు. విశాఖ ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖలో సూచనలు చేసినట్లు తెలిపారు. తమ సమస్యలను సీఎం సానుకూలంగా విన్నారని కార్మిక నేతలు చెప్పారు.

స్టీల్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉద్యమం చేయమని తమకు సీఎం సూచించినట్లు కార్మిక సంఘ నాయకులు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం శుభపరిణామని వారు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో సమావేశమైన వారిలో 14 మంది కార్మిక సంఘం నాయకులుఉన్నారు.