Sitaram Yechury : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం : సీతారాం ఏచూరి

కేంద్రం.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని ఏచూరీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగడం లేదన్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు.

Sitaram Yechury : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం : సీతారాం ఏచూరి

Yechury

Sitaram Achury criticized central government : దేశ సంపద, ఆస్తిని ప్రైవేటీకరణ పేరుతో దోచేస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం(డిసెంబర్ 27,2021) ప్రారంభమైన సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగడం లేదన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. రైతులు, కార్మికులు, కర్షక వర్గాలను ఐక్యం చేసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

NITI Aayog : ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి నంబర్ వన్ గా కేరళ

హిందూత్వ ఉన్మాదంతో దేశాన్ని కలుషితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఉద్దీపన ప్యాకేజీతో కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయని.. సామాన్యులకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చిలీ, పెరూ వంటి దేశాల్లో కమ్యూనిస్టులు బలపడుతున్నారని తెలిపారు.

మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో చర్చించి, రాజకీయ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సీతారాం ఏచూరీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, మహాసభలను ప్రారంభించారు. మహాసభలకు ఏచూరీతోపాటు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బీవీ.రాఘవులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజులపాటు మహాసభలు జరుగనున్నాయి.