దివ్య తేజస్విని కేసుపై దిశ స్పెషల్ విభాగం ఫోకస్

  • Published By: naveen ,Published On : October 16, 2020 / 04:42 PM IST
దివ్య తేజస్విని కేసుపై దిశ స్పెషల్ విభాగం ఫోకస్

divya tejaswini case: ఏపీలో సంచలనం రేపిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని ఘటనపై దిశ స్పెషల్ విభాగం ఫోకస్ చేసింది. దివ్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి దిశ స్పెషల్ విభాగం ఆఫీసర్ దీపికా పాటిల్ వెళ్లారు. దాడి జరిగిన తీరు దివ్య కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నాగేంద్ర చెబుతున్న విషయాలపై కూడా ఆరా తీశారు. తేజస్విని కేసులో వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే వారికీ శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. దివ్య కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారని ఆమె అన్నారు.

దివ్యకు కన్నీటి వీడ్కోలు:
ప్రేమోన్మాది చేతిలో బలైన దివ్య తేజస్విని అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, స్థానికులు దివ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. దివ్యను కిరాతకంగా చంపేసిన నాగేంద్రను కఠినంగా శిక్షించాలని పలువురు నినాదాలు చేశారు. ఆర్‌సీఎమ్‌ శ్మశానవాటికలో దివ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఆత్మహత్య చేసుకుందామని దివ్యే చెప్పింది:
గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్న నాగేంద్ర… దివ్య హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు. మూడేళ్లుగా దివ్యతో పరిచయం ఉందన్నాడు. ఏడాది క్రితమే దివ్యను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు. పెళ్లి విషయం దివ్య ఇంట్లో తెలిసిన తమను విడదీశారని అన్నాడు. ఏడు నెలలుగా దివ్య తనకు దూరంగా ఉందని… అందుకే మాట్లాడేందుకు ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చాడు. పెద్దలు ఒప్పుకోవట్లేదని.. చనిపోదామని దివ్యనే చెప్పిందని, అందుకే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించాడు నాగేంద్ర.

ఎవరికి వారే కత్తితో పొడుచుకున్నాం:
నాగేంద్ర చెబుతున్న దాంట్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సూసైడ్ చేసుకోవాలని ఇద్దరం నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాడు. అందులో భాగంగానే ఎవరికి వారే కత్తితో పొడిచేసుకున్నామని వివరించాడు. అదే నిజమైతే దివ్య పోస్ట్‌మార్టం నివేదికలో 13 కత్తిపోట్లు ఎందుకున్నాయన్నది అంతుపట్టడం లేదు. నాగేంద్రకు గంజాయి అలవాటు ఉందన్నది దివ్య పేరెంట్స్ వాదన. చెడు అలవాట్లు ఉన్న నాగేంద్ర సరైన వ్యక్తి కాదని.. పేరెంట్స్‌ దివ్యకు చెప్పినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల మాట విన్న దివ్య.. నాగేంద్రను దూరం పెట్టినట్టు సమాచారం. ఇది తట్టుకోలేకే నాగేంద్ర దాడి చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి.