Exams near Home: ఆన్లైన్ క్లాసులకే కాదు.. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇక ఇంటి నుంచే
కరోనా ప్రభావం తగ్గలేదు.. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తి చేయాలని భావించిన జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Exams near Home: కరోనా ప్రభావం తగ్గలేదు.. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తి చేయాలని భావించిన జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినట్లుగా ఆన్ లైన్ ఎగ్జామ్స్ కూడా ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు.
ముందుగా ప్రయోగాత్మకంగా బీటెక్ 8వ సెమిస్టర్ విద్యార్థులకు నిర్వహించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, అనేక పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
గతేడాది విద్యార్థులకు సమీపంలోని కాలేజీల్లో పరీక్షలు రాసుకొనే వెసులుబాటును కల్పించారు. ఇలా పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశమిచ్చి, సెమిస్టర్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు.
ఈసారి కరోనా ఉధృతి గతేడాది కంటే తీవ్రంగా ఉండటంతో పరీక్షాకేంద్రాల్లో నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదనే నిర్ణయానికి వచ్చారు. బీటెక్ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ పరీక్షలు కావడం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, జూన్, జూలై మాసాల్లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని.. పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూరు హస్సేన్ తెలిపారు.