ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసు : ఆ 8మంది డిటెన్షన్‌పై విచారణ 

ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది.

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 02:42 AM IST
ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసు : ఆ 8మంది డిటెన్షన్‌పై విచారణ 

ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది.

హైదరాబాద్‌ : అమెరికాలో ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్‌ ఫెడరల్‌ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. 8 మంది తెలుగు విద్యార్థుల తరఫున వాదనలు వినిపించేందుకు అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్‌ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్‌ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్‌ ఐసీఈ అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు.

 

యూఎస్‌ ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్‌ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్‌) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్‌ ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్‌ కాల్‌ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముం దని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్‌ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది.

 

డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నామని అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధి వెంకట్‌ మంతెన తెలిపారు. తమ సంస్థ తరపున ఎడ్వర్డ్‌ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించామన్నారు. మిచిగాన్‌ ఫెడరల్‌ న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగిందని చెప్పారు. ఫణీంద్రకు బెయిల్‌ రావడం శుభసూచకమన్నారు. వచ్చే వారం సెకండ్‌ ట్రయల్‌ ఉంటుందని, ఫణీంద్ర తరహాలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు తమ సంస్థ తరఫున అందిస్తామని పేర్కొన్నారు.

 

నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్‌ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. ‘ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు’ అని హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్‌ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) విచారం వ్యక్తం చేసింది.

Read Also:  జీవితం తలకిందులు : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దీనగాథ  

Read Also: అమెరికాలో నిర్బంధం : హైదరాబాద్ కు చేరిన 30 మంది విద్యార్థులు

Read Also: షాక్ లో స్టూడెంట్స్ : అమెరికాలో మరో 5 ఫేక్ యూనివర్సిటీలు!

Read Also: అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులు