Railway Reservation : ఈ రోజు అర్ధరాత్రి నుంచి 7 రోజులు రాత్రి పూట రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదు
వారంరోజుల పాటు రాత్రివేళ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను మూసి వేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Railway Reservation : దేశంలో కోవిడ్ కేసులు క్రమేపి తగ్గుముఖం పట్టడంతో రైల్వే శాఖ గతంలో రద్దు చేసిన పలు సర్వీసులను తిరిగి ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాదిన్నర కాలంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి, తర్వాతి కాలంలో ప్రత్యేక రైళ్ళ పేరుతో కొన్ని సర్వీసులను నడుపుతోంది.
ఇప్పుడు తాజాగా కరోనా ముందునాటి సాధారణ స్ధితికి రైల్వే సేవలను తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వారంరోజుల పాటు రాత్రివేళ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను మూసి వేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు, నవంబర్ 14వతేదీ అర్ధరాత్రి నుంచి 21 వతేదీ వరకు అర్ధరాత్రి సమయాల్లో ఆరుగంటల పాటు రిజర్వేషన్ సిస్టం పని చేయదు.
Also Read : AP Covid-19 Update : ఏపీలో మళ్లీ 200 దాటిన కోవిడ్ కేసులు
నవంబర్ 14-21 మధ్య గల రోజుల్లో అర్ధరాత్రి పూట గం.23-30 నుంచి ఉదయం గం.5-30 మధ్య ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కు సంబంధించి టికెట్ రిజర్వేషన్, కరెంట్ బుకింగ్, టికెట్ రద్దు, వీటికి సంబంధించిన విచారణ వంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే PRS సేవలు మినహా ఇతర అన్ని విచారణ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.