Kodali Nani : రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోద్దా? చినుకు పడితే హైదరాబాద్లో పడవలు తిరుగుతున్నాయి-హరీశ్ రావుకి కొడాలి నాని కౌంటర్
Kodali Nani: డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏం జరుగుద్దో తెలుస్తుంది. మాకు పక్క రాష్ట్రాలతో పోటీ అవసరం లేదు.
Kodali Nani : ఏపీలో అభివృద్ధి గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రా రాజకీయాల్లో దుమారం రేపాయి. హరీశ్ రావు వ్యాఖ్యలకు ఏపీకి చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అంతే ఘాటుగా రిప్లయ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ముందు మీ ప్రజలను పట్టించుకోండి, అక్కడి సమస్యలను పరిష్కరించండి అని ఎదురుదాడికి దిగుతున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోద్దా? అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు కొడాలి నాని. అంతేకాదు.. చినుకు పడితే హైదరాబాద్లో పడవలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ముందు ఆ పరిస్థితిని చక్కదిద్దండి అని హితవు పలికారు.
” ఖమ్మం వంటి జిల్లాలో రోడ్లు చూడండి ఎలా ఉంటాయో. చినుకు పడితే హైదరాబాద్ లో పడవలు తిరుగుతున్నాయి. రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోద్దా? ఏపీలో సంక్షేమం ఎలా జరుగుతుందో, తెలంగాణలో సంక్షేమం ఏముందో ప్రజలకి తెలుసు. ముందు మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి. మా పరిస్థితులు మేము చూసుకుంటాం.
తెలంగాణలో ఏమేం చేశారో ప్రజలు చూస్తున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏం జరుగుద్దో తెలుస్తుంది. బీఆర్ఎస్ వి కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు పక్క రాష్ట్రాలతో పోటీ అవసరం లేదు. మా ప్రయోజనాలు మేము చూసుకుంటాం” అని కొడాలి నాని అన్నారు.