Fake Currency : ఏం తెలివి.. యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్… కోట్లు సంపాదించాడు

Fake Currency : ఏం తెలివి.. యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్… కోట్లు సంపాదించాడు

Fake Currency

Fake Currency : యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దీని మూలాలు కనుగొన్నారు. అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లను తయారు చేశానని అతడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. అంతేకాదు ఆ డబ్బుతోనే వడ్డీ వ్యాపారం చేస్తూ నోట్ల మార్పిడి చేసి భారీగా సంపాదించినట్టు తెలడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ దందాతో కృష్ణారెడ్డి కోటీశ్వరుడు అయ్యాడని తెలుసుకుని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది.

కృష్ణారెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గత నెల 23న దూలం సాయి, గొట్టిముక్కల రవిశరన్‌, భీమవరపు యజ్ఞప్రదీప్‌, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర దొంగనోట్లు లభించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మూలాలు కనుగొన్నారు. నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో అనపర్తిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఒక సాధారణ తెల్లటి పేపర్‌పై రూ.200, 500 నోట్లను రెండు వైపులా అంటించి ముద్రించడం, ఎటువంటి తేడాలు లేకుండా కట్‌ చేయడం, శుభలేఖల పేపర్‌పై నిజమైన నోట్ల మాదిరిగా వాటిని ముద్రించడాన్ని స్వయంగా చూసిన పోలీసులు షాకయ్యారు. తాను వడ్డీకి తిప్పే నగదు కట్లలో ఐదు దొంగ నోట్లు ఉంచి నోట్ల మార్పిడి చేసేవాడినని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇంతే కాకుండా అనపర్తి పెట్రోల్‌ బంకులో పని చేసే వ్యక్తికి కమీషన్‌ ఇచ్చి నోట్ల మార్పిడి చేశానని వెల్లడించాడు.

కృష్ణారెడ్డి దొంగనోట్ల మార్పిడిని రెండేళ్ల నుంచి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.2కోట్లు వెనకేసి ఉంటాడని భావిస్తున్నారు. నోట్లు ముద్రించే కృష్ణారెడ్డితో పాటు సహకరించిన అనపర్తికి చెందిన దొరబాబును ఇబ్రహీంపట్నంకు చెందిన నలుగురు యువకులను పోలీసులు రిమాండ్‌కు పంపారు.