Andhra Pradesh : ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితులు బాధాకరం .. ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేరు : మంత్రి అప్పలరాజు
శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు ఎవ్వరు లేరు. ఒక్క డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదని... సూపరింటెండెంట్ తో సహా ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు,
Palasa Government Hospital In AP : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు ఎవ్వరు లేరు. ఒక్క డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదు. సూపరింటెండెంట్ తో సహా ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదు. ఇదేదో పతిపక్ష నేతలు చేసే ఆరోపణలు కాదు..విమర్శలు అంతకంటే కాదు. స్వయంగా వైసీపీ మంత్రిగారు చెప్పిన మాటలివి. పలాసలో ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు. తనిఖీలు చేపట్టారు. మంత్రి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లటంతో ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులు బాగా తెలిసాయి. ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదని..ఆస్పత్రిలో రోగులు పరిస్థితి బాధాకరంగా ఉంది స్వయంగా మంత్రి అప్పలరాజు ఆవేదన వ్యక్తంచేశారు.
పలాస ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ..ఆస్పత్రిలో పరిస్థితులు చూసి చాలా బాధేసిందని అన్నారు. 50 బెడ్లు ఉన్న పలాస ఆస్పత్రిలో సూపరింటెండెంట్ తో సహా ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఓపి చూడటానికి కూడా ఏ డాక్టర్ లేడని ఆస్పత్రిలో సిబ్బంది పనితీరుపై తనకు ఫిర్యాదు అందాయని దీంతో పరిస్థితిని పరిశీలించటానికి వస్తే ఇక్కడ పరిస్థితి కళ్లకు కనిపించంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రోగుల గురించి పట్టించుకోకుండా సమయానికి డ్యూటీలకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఇకనుంచి ఆస్పత్రిలో పరిస్థితి చక్కబడే వరకు ప్రతీరోజు పలాస ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేస్తానని మంత్రి సిదిరి అప్పలరాజు స్పష్టంచేశారు.
కాగా మంత్రి సిదిరి అప్పల రాజు స్వతహాగా డాక్టర్. రాజకీయాల్లోకి రాకముందు పలాసలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని నిర్వహించేవారు. మంత్రి అప్పలరాజు గతంలో కూడా ఓ సారి పలాస ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో మంత్రి ఓ మహిళకు వైద్యం చేశారు.