Meruga Nagarjuna : అంబేద్కర్.. ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు- మంత్రి నాగార్జున
కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున.
Meruga Nagarjuna : కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున. అందరూ హర్షించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారని మంత్రి ప్రశంసించారు. గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని నినాదాలు చేసిన వారే తర్వాత వ్యతిరేకించటం దురదృష్టకరం అన్నారు.
చెప్పిన దానికి జగన్ కట్టుబడి ఉంటారనడానికి ఇదొక నిదర్శనం అన్నారాయన. భారత రాజ్యాంగాన్ని రాయడం ద్వారా అంబేద్కర్ అందరివాడు అయ్యారని మంత్రి అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితాలను అన్ని వర్గాల వారు అనుభవిస్తున్నారని చెప్పారు. అమలాపురం ప్రాంతంలో సృష్టించిన అలజడిపై చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి నాగార్జున అన్నారు.
Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
అంబేద్కర్.. ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని మంత్రి నాగార్జున చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లలో విద్యార్థుల పరీక్ష ఫలితాలపై సమీక్ష చేశామన్నారు. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం అని చెప్పారు.
దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి స్థానంలో ఎస్టీ మహిళ కూర్చోనుండటం గర్వకారణం అన్నారాయన. దేశ అత్యున్నత పదవిని ఎస్టీ మహిళకు ఇవ్వటం ద్వారా భారత రాజ్యాంగం కలలు నెరవేరాయని మంత్రి నాగార్జున అన్నారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణు మీడియాకు తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమ్మఒడికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఆమోదం తెలిపిందన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీని మరింత మందికి వర్తింప చేసేలా చర్యలు చేపడతామన్నారు. పదెకరాల వరకు ఆక్వా సాగు చేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తామన్నారు. ప్రస్తుతమున్న జెడ్పీ చైర్మన్లనే వారి కాలపరిమితి ముగిసే దాకా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించిదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా.. ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ లే కొనసాగుతారని మంత్రి తెలిపారు. డిసిప్లినరీ ప్రొసిడీంగ్స్ ట్రిబ్యునల్ ను రద్దు చేశామన్నారు. రాజ్ భవన్ లో 100 కొత్త పోస్టులకు, గండికోటలో టూరిజం శాఖకు 1600 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
కాగా, రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమైన కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో అమలాపురం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును ఇకపై అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పరిగణిస్తారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో భేటీ అయిన ఏపీ కేబినెట్.. జిల్లా పేరు మార్పునకు సంబంధించి ఆమోద ముద్ర వేసింది. కోనసీమ జిల్లా పేరు మార్పుతో పాటు రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల కూర్పునకు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ దాదాపుగా రెండున్నర గంటల పాటు సమావేశమైంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఇక క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన ఉత్తర్వులకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మఒడి నిధుల విడుదలతో పాటుగా జులైలో అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్ల మేర పరిహారం ఇచ్చేందుకు కూడా మంత్రిమండలి ఓకే చెప్పింది.