Nara Lokesh : రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఫిర్యాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..

రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిస్థితులు తెలుసుకుంటామని చెప్పారు. న్యాయం ఆలస్యం కావొచ్చు, కానీ అంతిమంగా గెలుస్తుంది. Nara Lokesh

Nara Lokesh : రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఫిర్యాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..

Nara Lokesh Meets President

Nara Lokesh – Chandrababu Arrest : ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (Droupadi Murmu) కలిశారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. అలాగే ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. 13 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లోకేశ్.. జాతీయ పార్టీలకు చెందిన కీలక నేతలను కలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని, జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాగే ప్రముఖ న్యాయవాదులను కలిసి న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలో చర్చలు జరుపుతున్నారు.

స్కామ్ జరగకపోయినా సృష్టించారు..
రాష్ట్రపతితో భేటీ తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతితో చర్చించిన అంశాలను మీడియాకు తెలిపారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ” ఏపీలో 2019 నుండి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపై జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రపతికి వివరించాము. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో అవినీతి లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని రాష్ట్రపతికి తెలిపాము. ప్రతిపక్ష పార్టీలను కేసుల పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించాము. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిస్థితులు తెలుసుకుంటామని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షాలను, సామాన్యుల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. మా పోరాటం ఆగదు. మా పోరాటం ప్రజాక్షేత్రంలోకి తీసుకెళతాం.(Nara Lokesh)

Also Read: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

రిటర్న్ గిఫ్ట్ పక్కా..
యువగళం పాదయాత్ర ప్రారంభిస్తామని నిన్న ప్రకటించిన తర్వాత గిఫ్ట్ గా నన్ను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-14గా పెట్టారు. 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. ఢిల్లీ వచ్చి నన్ను అరెస్ట్ చేసే సత్తా అధికారులకు లేదా? అంటే కేసులో ఏమీ లేదని తేలిపోయింది కదా. కేసులో ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది కదా. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులతో నాకు సంబంధమే లేదు.

అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..
న్యాయ పోరాటం కోసం ఢిల్లీ వచ్చా. ఢిల్లీలో న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తున్నా.
అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. అందులో ఉన్న కేసు ఏంటో నాకు అర్థం కాలేదు. భవిష్యత్తుకు గ్యారెంటీ, యువగళం, వారాహి యాత్రలకు ప్రభుత్వం భయపడుతోంది. ప్రభుత్వం మాపై దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది.

ఒక్క ఆధారం కూడా లేదు..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కక్ష సాధింపు తప్ప ఏ ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదు. ఏ ఒక్క కేసులోనూ నాకు, నా కుటుంబానికి, నా సన్నిహితులకు ఒక్క పైసా కూడా రాలేదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా రకరకాల కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. న్యాయం ఆలస్యం అవుతుందే తప్పా.. జరక్కుండా పోదు. సీఐడీ ఆరోపిస్తున్న కంపెనీలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ల దగ్గర కనీసం కప్పు టీ కూడా తాగలేదు.(Nara Lokesh)

Also Read : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయితే మాకేం సంబంధం? హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు? చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా ఏపీకి సంబంధించిన వ్యవహారం అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

”దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆయనకి సంఘీభావంగా నిరసనలు తెలుపుతున్నారు. అందులో తప్పు లేదు. శాంతియుతంగా చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లంతా ప్రశాంతంగానే ఉన్నారు. తమ నాయకుడిని అరెస్ట్ చేశారనే బాధతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఎక్కడా శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు” అని లోకేశ్ అన్నారు.

త్వరలోనే ఏపీకి వస్తా..
చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ కు వెళ్లేటప్పుడు శాంతియుతంగా పోరాటం కొనసాగించమని చెప్పారు. నేను త్వరలోనే ఏపీకి వెళ్తాను. యువగళం పాదయాత్ర త్వరలోనే ప్రారంభిస్తాను. అనుమతి కోసం పోలీసులకు అప్లయ్ చేశాము. రేపు మా నేత చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఆ కేసు విచారణ పూర్తయిన తర్వాత నేను ఏపీ వెళ్తాను. యువగళం యాత్ర ప్రారంభిస్తాను” అని నారా లోకేశ్ తెలిపారు.

Also Read: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?