ఉండవల్లి కొండపై నవ దంపతులు ఆత్మహత్య

ఉండవల్లి కొండపై నవ దంపతులు ఆత్మహత్య

newly married couple suicide attempt in gunturu district : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల , కొండపైన  ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లిద్దరు నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా, భార్య చావు బతుకుల తో పోరాడుతోంది. ఆమె పరిస్ధితి విషమంగా ఉంది.

ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలంలోని  చిన్నముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన పృథ్వీ అనే యువకుడు,  హైదరాబాద్ జవహర్‌నగర్‌కు చెందిన ఫర్హానాలు మంగళవారం ఉండవల్లి గుహల సమీపంలోని   కొండపైకి వెళ్లారు. అక్కడున్న కొందరు పిల్లలు ఈవిషయం ఇంట్లో తల్లి దండ్రులకు చెప్పారు.

కొండపైకి వెళ్లిన ఈ జంట ఎంతసేపటికి కిందకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు కొందరు కొండపైకి వెళ్లి చూశారు.  అక్కడ  ఇద్దరూ నురగలు కక్కుతూ పడి ఉండటం చూశారు. వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చి ఇద్దరిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అప్పటికే పృథ్వీ చనిపోగా…. యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు ఆమెను  కొండ పైనుంచి మోసుకొచ్చి అంబులెన్స్ లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా  స్ధలానికి వచ్చి మృతుడి జేబులో ఫోన్ నంబర్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను గుర్తించారు. వాటి సాయంతో చిన్నముప్పాళ్లపాడులోని అతని తండ్రి గోపాలరెడ్డికి సమాచారం ఇచ్చారు.

కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు…. పృథ్వీ కొంత కాలం క్రితం తెనాలి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పండ్ల వ్యాపారం చేశాడు.  ఇటీవల హైదరాబాద్ వెళ్లి జవహర్‌నగర్‌ ప్రాంతంలో అదే వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడే ఫర్జానాతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి జనవరిలో పెళ్లి చేసుకుని పరారయ్యారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించటంలేదని హైదరాబాద్ లో స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మంగళవారం సాయంత్రం పృధ్వీ తన తండ్రికి ఫోన్ చేసి తాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. కోడలును ఇంటికి తెస్తున్నానని చెప్పాడు. పృథ్వీ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.  పల్లెటూరిలో ఆమెను తీసుకొస్తే  పరువు పోతుందన్నట్లు కుమారుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.  ఇది జరిగిన రెండు గంటల తర్వాత కొడుకు చనిపోయినట్లు తెలుసుకొన్నానని తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరో వైపు పృథ్వీతో ఫర్హానా వెళ్లినట్లు గుర్తించిన ఆమె బంధువులు చిన్నముప్పాళ్లపాడుకు చేరుకుని ఆరా తీశారు. ఇంతలోనే ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారని, పృథ్వీ మృతి చెందాడని తెలుసుకొని తీవ్ర ఆందోళన చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.