Pawan Kalyan : సీఎం జగన్ నివాసం ఉన్న చోటే ఇలాంటి దారుణాలా? పవన్ కల్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న చోటే దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న చోటే దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు పవన్ కల్యాణ్కు తమ కష్టాల గురించి చెప్పుకున్నారు.
అభివృద్ధి పనుల పేరిట, సీఎం భద్రత దృష్ట్యా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని తమ ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం, వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు పవన్ కల్యాణ్కు చెప్పారు. ఆ భూములను తమకు అప్పజెప్పాలని తమపై దారుణాలకు పాల్పడుతున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం కూడా ఏర్పాటు చేయకుండా ఇళ్లను లాక్కుంటున్నారని ఆరోపించారు.
దీనిపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ”సీఎం జగన్ నివాసం దగ్గర ఉన్న దాదాపు 320 ఇళ్లను ఖాళీ చేయాలని అంటున్నారు. ఆయన నివాసం ఉన్న చోటే ఇలాంటి దారుణాలు జరగడం ఏంటీ? రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా ఖాళీ చేయిస్తున్నామని అంటున్నారు. మహిళలని కూడా చూడకుండా పచ్చి బూతులు తిడుతుంటే బయట మానభంగాలు జరగకుండా ఇంకేమి జరుగుతుంటాయి?’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జగన్ గారికి నేను చెబుతున్నాను. మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లనే ఇలా కూల్చితే ఎలా? అంతగా అవసరం ఉంటే ముందుగా పునరావాసం ఏర్పాటు చేసి, పక్కా ఇళ్లు కట్టించాలి. అంతేగానీ, అవేమీ చేయకుండా భయపెట్టి వారిని ఖాళీ చేయాలని చెప్పడం సరికాదు. వృద్ధులని కూడా చూడకుండా ఊరి బయటకు తీసుకెళ్లి పాడేస్తామని చెబుతున్నారు’ అని పవన్ వాపోయారు.
‘ఈ 320 కుటుంబాలకు ముందు పునరావాసం కల్పించాలి. అలా చేయకుండా మీరు వారిపై దారుణాలకు పాల్పడితే జనసేన ఊరుకోదు. వారికి అండగా ఉంటాం’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా, వైద్య సిబ్బంది, నిరుద్యోగులు, పలువురు మహిళలు కూడా తమ కష్టాలను పవన్ కల్యాణ్ కు చెప్పుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి జనసేన కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ నడపడం అంటే కోట్లాది రూపాయల డబ్బుతో ముడిపడిన సమయంలో తాము జనసేన పార్టీని డబ్బుతో కాకుండా ప్రజల అండతో నడుపుతున్నామని చెప్పారు. ప్రజల కన్నీరు తుడవడానికే జనసేన ఆవిర్భవించిందని చెప్పారు.
శ్రీ @PawanKalyan గారిని కలిసిన ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల నిర్వాసితులు. pic.twitter.com/0vJCnCAtXt
— JanaSena Party (@JanaSenaParty) July 7, 2021