Piyush On Paddy Procurement : ధాన్యం సేకరణలో ఏపీ, తెలంగాణలో అవకతవకలు- పీయూష్ గోయల్
ధాన్యం సేకరణ అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.(Piyush On Paddy Procurement)
Piyush On Paddy Procurement : కేంద్రం, తెలుగు రాష్ట్రాల మధ్య ధాన్యం దంగల్ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ముఖ్యంగా కేంద్రం, తెలంగాణ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. తెలంగాణలో పండించిన ధాన్యం కేంద్రం కొని తీరాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధమైంది. ఇది ఇలా ఉంటే, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలుగు రాష్ట్రాలపై ఆరోపణలు చేశారు. ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అవకతవకలు జరిగాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అవకతవకలు, ఆలస్య రైతు చెల్లింపులపై కేంద్రం విచారణ చేపట్టాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని, వాటి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.(Piyush On Paddy Procurement)
Telangana : పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ వి బరితెగింపు వ్యాఖ్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి
రైతులకు ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదని, తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడా విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరారు జీవీఎల్. రైతుకు ధాన్యం సేకరించిన వెంటనే డబ్బు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాలకు 90 శాతం ధాన్య సేకరణ సొమ్మును ప్రధాన మోదీ అదేశాల మేరకు ముందుగానే చెల్లిస్తునామని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై పీయూష్ గోయల్ సంచలన ఆరోపణలు చేశారు. ధాన్యం సేకరణపై సీఎం ద్వారా తనను బెదిరించారని తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో పరోక్ష ఆరోపణలు చేశారాయన. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని.. చేసుకున్న ఒప్పందం ప్రకారం ముడిబియ్యం ఇస్తామన్నారని చెప్పారు. ఇప్పుడేమో కొత్తగా వడ్లు (ధాన్యం) సేకరించాలని కోరుతున్నారని.. పంజాబ్ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం లేఖ రాశారని పీయూష్ గోయల్ చెప్పారు. పంజాబ్లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని… కాబట్టి అలాంటి ముడి బియ్యాన్నే ఇవ్వాలని కోరామన్నారు.
అయితే, పదే పదే తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తోందని.. తెలంగాణలో పండే ముడి బియ్యం (రా రైస్) మొత్తం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో మిగులు ధాన్యాన్ని ముడిబియ్యం మాత్రమే తీసుకుంటామని.. రైతుల ఖాతాల్లోకి నేరుగా ధాన్యం సేకరణ డబ్బులు పంపుతున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ కోసం రాష్ట్రాలకు 90శాతం డబ్బు అడ్వాన్స్ గా పంపుతున్నామని.. ఏవైనా రాష్ట్రాలపై ఫిర్యాదులుంటే, బృందాలను పంపి రైడ్ చేస్తామని ప్రకటన చేశారు.
శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. తాము బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. అవసరం లేకుండా బియ్యం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. రా రైస్ అయితేనే తాము తీసుకుంటామని రాష్ట్రానికి స్పష్టంగా చెప్పామని పీయూష్ గోయల్ వెల్లడించారు. లేదంటే మీ రాష్ట్రంలోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని తెగేసి చెప్పారు.
Parliament : ధాన్యం దంగల్, సీఎం ద్వారా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు
తెలంగాణ ప్రభుత్వం తనను బెదిరించింది అంటూ పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ ది బరితెగింపు అని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పాత అబద్దాలే వల్లెవేశారని అన్నారు. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికం అన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టారని, మరి నాడు మోదీ చేసింది బెదిరింపేనా? అని మంత్రి నిరంజన్ నెడ్డి నిలదీశారు.
కేంద్రం.. కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగవిరుద్ధం అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్ గోయల్ కు పదవిలో ఉండే అర్హత ఉందా? అని నిలదీశారు. రైతులకు వెంటనే సమాధానం చెప్పాలని ఆన డిమాండ్ చేశారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్ లో రాష్ట్రాల నుండి బలవంతంగా లేఖలు తీసుకుని బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.