ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులంటూ నివాళులు అర్పించారు. ఏపీ అభివృద్ధికి సమర్థవంతంగా దుర్గా ప్రసాద్ కృషి చేశారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోడీ ప్రార్థించారు.
కరోనా వైరస్ బారిన పడిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో మృతిచెందారు. బల్లి దుర్గా ప్రసాద్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దుర్గా ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్విటర్ వేదికగా వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బల్లి దుర్గా ప్రసాద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా, ప్రాథమిక విద్యామంత్రిగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.