Pattabhiram : టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసు..మరో ఏడుగురు నిందితులకు నోటీసులు
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గుంటూరు అర్బన్ పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి కేసులో ఏడుగురిని గుర్తించి, విచారించారు.
TDP spokesperson Pattabhiram : మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గుంటూరు అర్బన్ పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య పదహారుకు చేరింది. మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. అటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి కేసులో పోలీసులు మరో ఏడుగురు నిందితులను గుర్తించి, విచారించారు. నిందితులకు 41ఏ సెక్షన్ కింద పటమట పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అరెస్టైన వారిలో నలుగురు విజయవాడ వాసులు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారు ఉన్నారు. విజయవాడకు చెందిన జోగరాజు, షేక్ బాబు, షేక్ సైదా, సూర్య సురేష్, గుంటూరుకు చెందిన మోహన్ కృష్ణారెడ్డి, గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం తెలిపింది. మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితుల గర్తింపు ప్రక్రియను చేపట్టారు.
TDP Office : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మరో ఆరుగురు అరెస్ట్
మరోవైపు బెయిల్పై విడుదలైన పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. శనివారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన..హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం క్రాస్ అయిన పట్టాభి వాహనం….పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర 10.30 గంటలకు చేరుకుంది.
అక్కడ పోలీసులు పట్టాభి వెంట వస్తున్న వాహనాలను నిలిపివేశారని చెప్తున్నారు. పట్టాభి ఇంటికి చేరుకుంటున్న మార్గమధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికేటింగ్ ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే ఆయన అప్పటి నుంచి ఇంతవరకు ఎవరికీ కనిపించలేదు.