ఏపీలో స్కూల్ అడ్మిషన్లు, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. టీచర్లకు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది.
సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం, 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.
అకడమిక్ క్యాలెండర్లోని ముఖ్యాంశాలు:
* అడ్మిషన్ల ప్రక్రియలో విద్యార్థులను స్కూళ్లకు రప్పించకూడదు, పాఠశాలలకు తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి.
* ప్రతి టీచర్ రానికి ఒకసారి మాత్రమే పాఠశాలకు రావాలి. బయోమెట్రిక్ అటెండెన్స్ అవసరం లేదు.
* ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి.
* పాఠ్యాంశాలకు ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్లో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.
* విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్) ఒక రకం, రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న వారు(లోటెక్) రెండో రకం, కంప్యూటర్ గానీ మొబైల్ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు(నోటెక్) మూడో రకం.
* టీచర్లు ఈ మూడో రకం విద్యార్థులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి
* గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేని వారిపైన దృష్టి పెట్టే విధంగా టీచర్ ప్రణాళికను తయారు చేసుకోవాలి.
* 1 నుంచి 5వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్లో చూపిన విధంగా కృత్యాలు చేయించాలి.
* 6 నుంచి 8వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి.
* 9, 10 తరగతులకు అంశాల వారీగా టీచింగ్ చెప్పొచ్చు. ఆన్లైన్, రేడియోల ద్వారా భోదన చేయొచ్చు
* ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు.
* తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చుకోవడానికి టీసీ అడిగితే ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా అందించాలి.
* వలస కుటుంబాల పిల్లల ప్రవేశాలకు ఐడెంటిటీ నిరూపణ తప్ప ఏ ధ్రువపత్రాలు అడగకూడదు.
* స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చు.
* ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి. కానీ అందరూ ఒక్క రోజే హాజరుకావాల్సిన అవసరం లేదు. వారు ఏ రోజు హాజరు కావాలన్న విషయమై హెచ్ఎం ఉత్తర్వులివ్వాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి.
* దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్నవారు, శారీరక వైకల్యం కలిగినవారు, కంటైన్మెంట్ జోన్లలో పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సిన అవసరం లేదు.
* కానీ తరగతి వారీగా, విద్యార్థి వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ప్రణాళిక అమలు చేయాలి.
* ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్లో సూచించిన విధంగా ప్రతి టీచర్ రోజూ కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించాలి.
* మరుసటి రోజు నుంచి ఐదుగురు చొప్పున తల్లిదండ్రులకు మళ్లీ ఫోన్ చేసి వారి పిల్లల పురోగతి తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.
* టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసుకుని ప్రతి శనివారం ఫొటో రూపంలో గూగుల్ ఫారంలో అప్లోడ్ చేయాలి. ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వో, డిప్యూటీ ఈవో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంక్షేమం, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ క్యాలెండర్ రూపొందించింది. వారంతా ఈ క్యాలెండర్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.