చరిత్రలో తొలిసారి, ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ, ఏ ఏడాది చాలా భిన్నంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. చరిత్రలో మొదటిసారిగా భక్తులు లేకుండానే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈసారి రెండు సార్లు బ్రహోత్సవాలు జరపాలని టీటీడీ పాలక మండలి గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం తిరుమలలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే, కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రంగనాయకుల మండపంలో స్థలబావం కారణంగా వాహన సేవలను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక, స్వర్ణ రథం, రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని నిర్వహించనున్న టీటీడీ అధికారులు తెలిపారు. ఇక, వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుండి 10గంటల వరకు మాత్రమే శ్రీవారి వాహన సేవలు. తిరిగి రాత్రి 7నుండి 8 గంటల వరకు వాహనసేవలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ నెల 27న శ్రీవారి ఆలయంలోని అద్దాల మహల్ లో ఉదయం 6 నుండి 9గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆన్ లైన్ లో కళ్యాణోత్సవ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
* సెప్టెంబర్ 19 నుండి 27వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
* బ్రహోత్సవాలకు 18న అంకురార్పణ
* 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
* సెప్టెంబర్ 19న – ధ్వజారోహణం
* సెప్టెంబర్ 23న – గరుడసేవ
* సెప్టెంబర్ 24న – స్వర్ణరథోత్సవం(సర్వభూపాల వాహనం)
* సెప్టెంబర్ 26న – రథోత్సవం(సర్వభూపాల వాహనం)
* సెప్టెంబర్ 27న – చక్రస్నానం, ధ్వజావరోహణం.
కాగా కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో 24న స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేం చేస్తారు.