Toll Gate Charges Hiked : వాహనదారులకు మరో షాక్.. టోల్గేట్ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై..
Toll Gate Charges Hiked : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ ధరలూ పెరిగాయి. నూనెల ధరలు సలసల మరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో భారం పడింది. వాహనదారులకు షాక్ తగిలింది. టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదుగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ఫీజుల రూపంలో వాహనదారులకు బాదుడు మొదలు కానుంది. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం నుంచి పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి.(Toll Gate Charges Hiked)
Nitin Gadkari On Toll Plazas : 3 నెలల్లో.. ఆ టోల్ ప్లాజాలను మూసేస్తాం-నితిన్ గడ్కరీ
* కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10 పెంపు.
* బస్సులు, లారీలకు రూ.15-25 పెంపు.
* భారీ వాహనాలకు రూ.40-50 వరకు టోల్ ఫీజు పెంచనున్నారు.
* సింగిల్, డబుల్ ట్రిప్లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.
రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ప్రస్తుతం రోజుకు సగటున రూ.6.6 కోట్ల వరకు టోల్ వసూలవుతోంది. అంటే ఏడాదికి రూ.2,409 కోట్ల వరకు వస్తోంది. తాజాగా పెంచుతున్న ఫీజులతో ఇది మరింత పెరగనుంది.(Toll Gate Charges Hiked)
ఇది ఇలా ఉంటే.. టోల్ ప్లాజాల విషయంలో వాహనదారులకు కేంద్రం కాస్త ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. వాహనదారుల జేబులపై కాస్త భారం తగ్గనుంది.
జాతీయ రహదారులపై అడుగడుగునా ఉంటున్న టోల్ ప్లాజాలు వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. అనవసరంగా అదనంగా డబ్బు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు.
కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదని… కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. అలాంటి వాటిని మూడు నెలల్లో మూసేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి డబ్బు వస్తోందని ఆలోచిస్తే… ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతారని మంత్రి అన్నారు.
‘‘జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అలా ఉన్నాయి. ఇది తప్పు. చట్ట విరుద్ధం కూడా. ఒక టోల్ బూత్కు 60 కిలోమీటర్లలోపే రెండో టోల్ ప్లాజా ఉంటే వాటిని మూసివేస్తాం. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా అని ఆలోచిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వాటిని తొలగించాలని నిర్ణయించాం’’ అని గడ్కరీ అన్నారు. దీంతో పాటు టోల్ ప్లాజాలకు దగ్గరగా నివసించే ప్రజలు తమ ఆధార్ కార్డులు చూపించి పాస్లు తీసుకోవచ్చని గడ్కరీ తెలిపారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపులపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.