TTD: శ్రీవారి అన్ని సేవలకూ ఒకే యాప్.. జియోతో టీటీడీ ఒప్పందం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది.

TTD: శ్రీవారి అన్ని సేవలకూ ఒకే యాప్.. జియోతో టీటీడీ ఒప్పందం

Ttd

TTD signed an MoU with Jio: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టీటీడీ- జియో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో ఎవీ ధర్మారెడ్డి జియో ప్రతినిధి అనిష్ ఎంఓయుపై సంతకాలు చేశారు.

అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారని అన్నారు. దీంతో టిటిడి సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయని, ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పారు.

గత నెలలో జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటలోపే టికెట్లు బుక్ చేసుకున్నట్లు చెప్పారు. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ యాప్‌లో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని సుబ్బారెడ్డి చెప్పారు.

రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్‌ను ఆవిష్కరించే ఏర్పాటు చేయాలని సుబ్బారెడ్డి జియో ప్రతినిధులను కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సమన్వయంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.