AP Politics : వెయింటింగ్ లిస్ట్ లోనే నటుడు అలీ పేరు..ఏ పదవి ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నాడట పాపం..
జాలీగా రాజ్యసభకు వెళ్లిపోవచ్చనుకున్న సినీ నటుడు అలీకి.. ఊహించని షాక్ ఇచ్చారు సీఎం జగన్. రాజ్యసభ లిస్ట్లో తన పేరు కచ్చితంగా ఉంటుందంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చున్న అలీ.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన చూసి అవాక్కయ్యారు. కానీ జగన్ తనకంటూ ఓ పదవి ఇస్తారని ఆశతో ఉన్నారు అలీ..మరి ఆయన కల ఎప్పటికి నెరవేరేనో..
ALI KI JHALAK : వరుసగా పిలుపులు.. ఆంతరంగికంగా చర్చలు.. ఇంకేముంది… జాలీగా రాజ్యసభకు వెళ్లిపోవచ్చనుకున్న సినీ నటుడు అలీకి.. ఊహించని షాక్ ఇచ్చారు సీఎం జగన్. రాజ్యసభ లిస్ట్లో తన పేరు కచ్చితంగా ఉంటుందంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చున్న అలీ.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన చూసి అవాక్కయ్యారు. చివరకు వైసీపీకి అనుకూలంగా ఒక్క మాటైనా మాట్లాడని ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేసిన జగన్.. తనను ఎందుకు పక్కన పెట్టారన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారట అలీ.
ఏపీ నుంచి ఈసారి రాజ్యసభ సీటు తప్పకుండా తనకే వస్తుందనుకున్నారు సినీ నటుడు అలీ. ఫ్యాన్ రెక్కలు తిరిగినట్లు తిరుగుతూ గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన అలీ.. వైసీపీ అధికారంలోకి రావడంతో తన కష్టానికి ఫలితం దక్కుతుందనుకున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ తెరపైకి వచ్చిన ప్రతీ సారీ అలీ పేరు తెరపైకి వస్తూనే ఉంది.. పక్కకు తప్పుకుంటూనే ఉంది. అయితే.. ఈ సారి మాత్రం రాజ్యసభ సీటుపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు టాలీవుడ్ కమేడియన్. సూపర్ హిట్ సినిమా రేంజ్లో ఆయన కన్న కల.. ఫస్ట్ షో బాక్సాఫీస్ దగ్గర తిరగబడ్డ సినిమాలా అయిపోయింది.
పాపం.. అలీ ఆశలు పెట్టుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ మధ్యే సీఎం జగన్ను కలిసిన అలీ.. చాలా ఖుషీగా బయటకు వచ్చారు. త్వరలోనే తనకు పదవి రాబోతోందంటూ సంబరంగా చెప్పుకున్నారు. ఏమిస్తారన్నది త్వరలోనే ఫోన్ చేసి చెబుతారనీ చెప్పుకున్నారు. కానీ.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆ ఫోన్ కాల్ మాత్రం అలీకి వెళ్లలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి డయల్ చేసిన నెంబర్ లైన్ మార్చుకుని.. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇంట్లో మోగింది. ఆయన విజయవాడ వెళ్లడం.. సీఎం జగన్ను కలవడం.. రాజ్యసభ సీటును ఆయనకు కేటాయించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడని, పైగా తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యకు ఇచ్చిన ప్రియారిటీ తనకెందుకు ఇవ్వలేదని తెగ ఫీలైపోతున్నారు
టాలీవుడ్ వివాదంలోనూ సీఎం జగన్తో చర్చలకు ఆహ్వానించిన వారిలో అలీ కూడా ఉన్నారు. ఆసమయంలోనే పర్సనల్గా వచ్చి కలవాలంటూ జగన్ సూచించారు. దీంతో.. కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఆయన్ను కలిసి వచ్చారు అలీ. అప్పుడే ఆయనకు త్వరలోనే గుడ్న్యూస్ చెబుతామంటూ హామీ ఇచ్చారు సీఎం జగన్ . దానికి తగ్గట్లే మైనార్టీ కోటాలో రాజ్యసభ సీటు కేటాయిస్తారంటూ ప్రచారమూ సాగింది. ఆయన కూడా తనకి రాజ్యసభ పక్కా అంటూ లెక్కలు వేసుకున్నారు. రాజ్యసభ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి తన పేరు ప్రకటిస్తారని వేయి కళ్లతో ఎదురు చూశారు. కానీ.. ఆ ఎదురు చూపులు ఫలించలేదు. గతంలో ఎమ్మెల్సీగా ఛాన్స్ వస్తుందంటూ ఇదే స్థాయిలో ప్రచారం సాగింది. కానీ, అప్పుడూ వైసీపీ హైకమాండ్ నుంచి మొండిచెయ్యే ఎదురయ్యింది. అటు వక్ఫ్బోర్డ్ చైర్మన్ పదవిని కూడా అలీ ఇస్తారంటూ జోరుగా చర్చసాగింది. ఆ ఛాన్స్ కూడా అలీ గడప తొక్కలేదు. ఇప్పుడు రాజ్యసభ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. దీంతో.. అసలు అలీకి ఏదైనా పదవి వస్తుందా.. రాదా అన్నది వైసీపీలో హాట్ టాపిక్గా మారింది.