మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్త్రి హత్యాయత్నం

  • Published By: vamsi ,Published On : November 29, 2020 / 12:22 PM IST
మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్త్రి హత్యాయత్నం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే హత్యాయత్నం నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు. ఈ సమయంలో ఆయన చొక్కా చిరిగిపోయింది. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న బడుగు నాగేశ్వరారావు అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. తాపీతో ఆయనపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.



మచిలీపట్నంలోని తన సొంత నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి కాళ్లకు దండం పెట్టడానికి వెళ్లినట్లుగా వెళ్లి అనూహ్యంగా మంత్రిపై దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న తాపీతో కొట్టబోయాడు. సకాలంలో అతని కదలికలను గుర్తించిన అనుచరులు ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు.



ఇదివరకు మచిలీపట్నంలోనే పేర్నినాని అనుచరుడు దారుణహత్యకు గురవగా.. ఇప్పడు ఈ విషయం సంచలనంగా మారింది. నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానా,లేక కక్షపూరితంగా, పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేశారా? అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.