April 1st : అమ్మో ఏప్రిల్ 1వ తారీఖు
నిన్నటితో మార్చి నెల ముగిసింది. మార్చితో పాటు ఈ ఆర్థిక సంవత్సరమూ ముగిసింది. శుక్రవారం, ఏప్రిల్ 1, నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రూల్స్ మారనున్నాయి.

Taxes Increase
April 1st : నిన్నటితో మార్చి నెల ముగిసింది. మార్చితో పాటు ఈ ఆర్థిక సంవత్సరమూ ముగిసింది. శుక్రవారం, ఏప్రిల్ 1, నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రూల్స్ మారనున్నాయి. ధరల నుంచి బ్యాంకింగ్ నియమాల దాకా మనల్ని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అన్నింటికంటే ముందుగా ఏపీ, తెలంగాణల్లో కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో పేదలకు కరెంట్ భారం పడనుంది.
ఏప్రిల్ ఫస్ట్… కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ మాత్రమే కాదు… పలు మార్పులకు శ్రీకారం చుడుతున్న రోజు. ఏప్రిల్ ఫస్ట్ అంటే చాలా మంది ఫూల్స్ చేస్తారు. కానీ మేం చెప్పేది మాత్రం ఏప్రిల్ ఫూల్ చేసేందుకు కాదండోయ్. ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పలు రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఏపీ, తెలంగాణలో పెరిగిన కరెంట్ ఛార్జీలు అమలుకానున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీగానే భారం మోపుతున్నాయి విద్యుత్ సంస్థలు.
ఏసీ వేయాలన్నా, ఫ్యాన్ వేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. దీంతో పాటు వంటింట్లో మళ్లీ ఏప్రిల్1న గ్యాస్ బాంబ్ పేలే అవకాశం ఉంది. ఇటీవలే గ్యాస్ బండపై 50 రూపాయలు పెంచి భారం చేశారు. ప్రతినెల 1న కంపెనీలు గ్యాస్ ధరలను రివ్యూ చేస్తుంటాయి. అందులో భాగంగా మరోసారి వడ్డించే అవకాశాలు లేకపోలేదు.
హైదరాబాద్లో ఏప్రిల్ 1నుంచి బస్పాస్ ఛార్జీలు పెరగనున్నాయి. ఇటీవలే సిటీ సర్వీసుల్లో ఛార్జీలను కొంతమేర పెంచిన TSRTC ఇప్పుడు బస్పాస్లపై భారీగానే వడ్డిస్తోంది. ఇటు తిరుమలలో ఏప్రిల్ 1నుంచి ఆర్జిత సేవలు మొదలుకానున్నాయి. వయో వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి దర్శనం కల్పించనుంది TTD. ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు కూడా పెరగనున్నాయి. జ్వరం మాత్రల నుంచి గుండెజబ్బులకు వాడే మందుల వరకు దాదాపు 10శాతం మేర పెంచే అవకాశం ఉంది.
ఆదాయపన్ను, జీఎస్టీలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో కొన్ని కస్టమర్లకు ఊరటనిస్తుంటే మరికొన్ని భారంగా మారనున్నాయి. EPF ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రెండున్నర లక్షల వరకే పన్ను ఉండదు. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. దేశంలో క్రిప్టో ఆస్తుల పన్ను విధానం కూడా అమల్లోకి రానుంది. 30 శాతం పన్ను, 1 శాతం TDS వేయనున్నారు.
నష్టాలతో సంబంధం లేదు. లాభం వస్తే మాత్రం పన్ను కట్టాల్సిందే. ఇకనుంచి పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలంటే సేవింగ్స్ లేదా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ఈ పథకాలపై అందుకునే వడ్డీ ఏప్రిల్ 1నుంచి ఆ ఖాతాల్లోనే జమవుతుంది.
ఇకనుంచి సామాన్యుడి సొంతింటి కల కాస్త కష్టతరం కానుంది. మొదటి ఇల్లు కొనుగోలు చేసేవారికి సెక్షన్ 80EEA కింద ఇస్తున్న పన్ను మినహాయింపు అనేది ఏప్రిల్ 1నుంచి ఉండదు. దీని ప్రకారం ఇంటివిలువ 45 లక్షల కంటే తక్కువ ఉంటే గృహరుణ వడ్డీ చెల్లింపుపై లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆపేయనున్నారు.
ఆధార్తో పాన్ లింక్ గడువు నిన్నటితో ముగిసింది. ఏప్రిల్ 1నుంచి కొన్ని వాహనాల ధరలు పెరగనున్నాయి. హోండా బైక్లు 2వేల వరకూ ప్రియం కానున్నాయి. అలాగే లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, టయోటా వాహనాల రేట్లు కూడా పెరగనున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది వర్క్ ఫ్రం హోమ్.}
Also Read : Dr YSR Tallibidda Express : నేడు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ప్రారంభం..గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు
కరోనా కారణంగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించిన కంపెనీలు ఏప్రిల్ 1నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటున్నాయి. పూర్తిస్థాయిలో ఆఫీసులు తెరిచి హైబ్రీడ్ వర్క్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఆయా కంపెనీల ఉద్యోగులకు సమాచారం అదించాయి. ఇక ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణమధ్య రైల్వే 104 ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 1నుంచి నడపనుంది.