చెల్లెలిపై ఈవ్ టీజింగ్…అడ్డుకున్నందుకు కాల్చి చంపారు

చెల్లెలిపై ఈవ్ టీజింగ్…అడ్డుకున్నందుకు కాల్చి చంపారు

Man shot dead for protesting eve-teasing : ఓ పోకిరీ పెట్టే వేధింపులకు ఉత్తరప్రదేశ్ లో అన్నా,చెల్లెళ్లు బలయ్యారు. తన చెల్లెలిపై వేధింపులు ఆపమని కోరినందుకు, కోపం పెంచుకున్న నిందితుడు ఒక యువకుడిని కాల్చి చంపాడు. అంతకు కొద్దిరోజుల ముందే వేధింపులు భరించలేక అతడి చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదఘటన ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లా, ఖత్రివాడలో జరిగింది.

ఖత్రివాడలో తన ఇంటిలోనే రామ్ వీర్ కుటుబం కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. కిరాణా షాపుతోపాటు అవసరమైన వారికి బ్యాటరీలు కూడా సప్లయ్ చేస్తూ ఉండేవాడు రామ్ వీర్. గురువారం,నవంబర్ 12వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో అతని పొరుగున ఉండే కపిల్ అనే వ్యక్తి వచ్చి పంచదార కావాలి అని అడిగాడు. ఇంకా షాపు తీయలేదని కాసేపాగి రమ్మని రామ్ వీర్ చెప్పాడు.


పంచదార అత్యవసరమని కపిల్ బలవంతం చేయటంతో రామ్ వీర్ షాపు తెరిచి పంచదార కట్టి ఇవ్వబోయాడు. ఆసమయంలో కపిల్ తో పాటు వచ్చిన అతడి సోదరుడు ఆకాష్ తుపాకితో రామ్ వీర్ మెడపై కాల్పులు జరిపాడు.

కాల్పులకు కింద పడిపోయిన రామ్ వీర్ ను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


కాగా… ఆకాష్ తన కుమార్తెను వేధించేవాడని.. వేధింపులు ఆపమని తన కుమారుడు ఆకాష్ కు చెప్పాడని రామ్ వీర్ తండ్రి సోహన్ లాల్ చెప్పారు. ఆకాష్ పెళ్లి చేసుకోమని వేధింపులకు గురి చేయటంతో తమ కుమార్తె నవంబర్ 8న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని .. ఆకాష్ కు భయపడే తాము పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని సోహన్ లాల్ వాపోయాడు. సోహన్ లాల్ స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.