Honour Death : వేరే కులం వారిని ప్రేమిస్తున్నారని.. ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన కన్న తల్లిదండ్రులు
Honour Death : ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య తర్వాత కూతుళ్ల మృతదేహాల పక్కనే తల్లి ఉంది.
Honour Death : మనిషి ఎంతో అభివృద్ధి చెందాడు. ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. ఎన్నో గొప్ప పనులు చేశాడు. అయినా.. ఇంకా కులం, మతం అనే పిచ్చి నుంచి బయటకు రావడం లేదు. కులం, మతం పేరుతో దిగజారిపోతున్నాడు. మర్డర్లు కూడా చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే.. కులం కోసం మతం కోసం రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్నారు. చివరికి రక్త సంబంధీకులు, కన్న బిడ్డల కన్నా కుల మతాలే ఎక్కువైపోయాయి.
తాజాగా.. వేరే కులం వారిని ప్రేమిస్తున్నారనే కోపంతో కన్నతల్లిదండ్రులు దారుణానికి ఒడిగట్టారు. కడుపున పుట్టిన కూతుళ్లను కడతేర్చారు. బీహార్ రాష్ట్రం హాజీపూర్ లో ఘోరం జరిగింది. ఇతర కులాలకు చెందిన వారిని ప్రేమిస్తున్నారన్న కోపంతో తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లను హత్య చేశారు. కూతుళ్లు నిద్రలో ఉండగా కడతేర్చారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని తల్లి చెప్పింది.
తండ్రి నరేశ్ భాటియా, తల్లి రింకూదేవి తమ ఇద్దరు కూతుళ్లను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య తర్వాత కూతుళ్ల మృతదేహాల పక్కనే తల్లి ఉందని, తండ్రి మాత్రం పారిపోయాడని పోలీసులు తెలిపారు.
రింకూ దేవి, నరేశ్ భాటియా దంపతులు హాజీపూర్ వైశాలి జిల్లాలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒకరి వయసు 16ఏళ్లు, మరొకరి వయసు 18ఏళ్లు. కాగా, అదే గ్రామానికి చెందిన వేరే కులం కుర్రాళ్లతో నరేశ్ కూతుళ్లు ప్రేమలో పడ్డారు. అంతేకాదు.. పలు మార్లు ప్రేమించిన కుర్రాళ్లతో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికి వచ్చారు. ఇలా పలుసార్లు జరిగింది.
అసలే కులాంతర ప్రేమ, పైగా ఇంటి నుంచి పారిపోవడం.. తమ కూతుళ్ల కారణంగా తమ కుటుంబం పరువు పోయిందని నరేశ్ దంపతులు ఆవేదన చెందారు. ఈ క్రమంలో వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం పరువు తీసిన ఇద్దరు కూతుళ్లను కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. శనివారం అర్థరాత్రి తర్వాత కూతుళ్లిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. అదే అదనుగా.. తల్లిదండ్రులు వారిని చంపేశారు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి వచ్చేసరికి మృతదేహాల దగ్గర తల్లి రింకూ దేవి మాత్రమే ఉంది. తండ్రి నరేశ్ భాటియా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు తల్లి రింకూ దేవీని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు.
Also Read..Pit bull Dog Attacks : బాబోయ్.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన కుక్క, కొట్టి చంపిన జనం
తన భర్తే తన కూతుళ్లను చంపినట్లు రింకూ దేవి పోలీసులతో చెప్పింది. కాగా దంపతులిద్దరూ కలిసి కూతుళ్లను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతి చెందిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని రోషిని కుమార్(18)గా గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. మరో అమ్మాయి పేరు తన్నూ కుమారి(16). ఈ ఏడాదే మెట్రిక్యులేషన్ పాస్ అయ్యింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.