Karnataka : విడాకులు కోరిన భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచిన భర్త
మోసం చేసి వివాహం చేసుకున్న భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్యను, భర్త కిరాతకంగా పొడిచిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Karnataka : మోసం చేసి వివాహం చేసుకున్న భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్యను, భర్త కిరాతకంగా పొడిచిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని గడగ్ జిల్లా హుబ్బలి నివాసి మహ్మద్ ఎజాజ్ షిరూర్ అనే వ్యక్తికి అపూర్య పురాణిక్ అనే మహిళతో వివాహం జరిగింది.
మహ్మద్కు ఇంతకు మునుపే వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచి పెట్టి మరీ అపూర్వని పెళ్లి చేసుకున్నాడు. తాను చదువుకుంటున్నానని… పార్ట్ టైం ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాని మాయమాటలు చెప్పి అపూర్వని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది.
కొన్నాళ్లకు భర్త చెప్పిన వన్నీ అబధ్దాలని తెలుసుకున్న అపూర్వ భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. తనకు విడాకులివ్వమని భర్తను కోరి….కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ఒప్పుకోని మహ్మద్ భార్యపై కక్ష పెంచుకున్నాడు. అపూర్వ కదలికలపై నిఘా పెట్టాడు. ఆమెపై దాడి చేసేందుకు సిధ్ధపడ్డాడు. అందులో భాగంగానే ఆమె స్కూటీ నేర్చుకుంటుండగా కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు.
ఇది గమనించిన స్థానికులు గాయాల పాలైన అపూర్వను వెంటేనే ఆస్పత్రికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు. అపూర్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె శరీరంపై దాదాపు 22 కత్తి గాయాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.